ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే.. చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటల్లో చుక్క నీరుండేది కాదు. నెర్రలు బారి ఎడారిని తలపించేవి. మెట్ట ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో అయితే వానకాలంలోనే అధ్వానంగా మారేవి. అయినా నాటి పాలకులు పట్టించుకోలేదు. ఊరంతటికీ కల్పతరువైన ఆ చెరువులను బాగు చేయించలేదు. కనీసం ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు జీవం పోసుకున్నాయి. కాళేశ్వరం జలాలతో ఇప్పుడు నడి వేసవిలోనూ నిండు కుండల్లా మారాయి. వానకాలంలోనే కాదు, ఎండకాలంలోనూ మత్తళ్లు దుంకుతూ కనువిందు చేస్తున్నాయి. రెండు పంటలకూ నీరందిస్తూ రైతులకు భరోసానిస్తున్నాయి.
కరీంనగర్, మే 22 (నమస్తే తెలంగాణ) : మిషన్ కాకతీయ, కాళేశ్వ రం జలాలతో చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా తీసుకున్న చర్యల కారణంగా నిండు వేసవిలోనూ జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు పుష్కలమైన నీటితో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు గండ్లుపడిన కట్టలు, తెగిపోయిన మత్తళ్లు, చెరువుల్లో పిచ్చి మొక్కలు, సర్కారు తుమ్మ పొదలు, నల్ల తుమ్మ చెట్లు కనిపించేవి. ఉమ్మడి రాష్ట్రంలో వాటిని పట్టించుకున్న పాలకులు లేరు. దశాబ్దాల తరబడి చూపిన నిర్లక్ష్యానికి చెరువులు, కుంటలు నిర్వీర్యమై పోయాయి. చిన్న వర్షం పడితేనే కట్టలు తెగిపోయి ఆనవాలు లేకుండా తుడిచి పెట్టుకుపోయాయి. వీటి పరిధిలో ఆయకట్టు ఉన్న రైతులు పూర్తిగా వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే వారు.
ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కోట్లాది రూపాయలతో మిషన్ కాకతీయ ద్వారా అనేక చెరువులు, కుంటలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరించింది. చెరువులు, కుంటల్లో పూడిక తొలగించింది. కట్టలను బలోపేతం చేసింది. మత్తళ్లు, తూములను మరమ్మతు చేసింది. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను సర్వే చేసి నీటి విస్తీర్ణాన్ని స్థిరీకరించింది. దీంతో అనేక చెరువులు, కుంటలు మునుపటి స్థితికి చేరుకుని రైతులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. అంతే కాకుండా, మూడేళ్లుగా వస్తున్న కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వాన కాలంలో ఎంత వర్షం పడినా చుక్క నీరు నిలువని వందలాది చెరువులు ఇప్పుడు నిండు వేసవిలో కూడా నిండు కుండల్లా కనిపిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,376 చెరువులు ఉండగా నాలుగు విడుతల్లో మిషన్ కాకతీయ కింద రూ.232.81 కోట్లు ఖర్చు చేసి 956 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఇందులో 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం జలాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించబడిన అనేక చెరువులకు నీటిని మళ్లించారు. 596 గొలుసుకట్టు లింకులను గుర్తించి వెసులుబాటు ఉన్న ప్రతి చెరువుకు కాళేశ్వరం జలాలు తరలిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుత వేసవిలోనూ జిల్లాలోని 311 చెరువుల్లో 50 శాతానికిపైగా నీళ్లున్నాయి. 31 చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టంతో కనిపిస్తున్నాయి. మరిన్ని చెరువుల్లో 25 శాతానికి మించి నీళ్లున్నాయి. నెల కింద కాళేశ్వరం జలాలను విడుదల చేసినప్పుడు అనేక చెరువులు మత్తళ్లు దుంకాయి.
గంగాధర మండలం నారాయణపూర్ చెరువు కింద పలు గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. ఒకప్పుడు మెట్ట ప్రాంతంగా గుర్తించిన చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్ మండలాల్లోని చెరువులకు వరద కాలువ పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ద్వారా ప్యాకేజీ-3 కింద నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా చిగురుమామిడి మండలంలోని రామంచ, ముదిమాణిక్యం, సీతారాంపూర్, రేకొండ, ముల్కనూర్, సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి, తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి, నల్లగొండ, పోలంపల్లి, మన్నెంపల్లి, తదితర గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీటితో నిండి ఉన్నాయి. గంగాధర మండలం ఆచంపల్లి వద్ద వరద కాలువకు ఏర్పాటు చేసిన తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల, బద్దిపల్లి, కమాన్పూర్ తదితర గ్రామాల్లోని చెరువులకు నీటిని తరలిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 1072 చెరువులు ఉండగా ఇందులో మిషన్ కాకతీయ ద్వారా నాలుగు విడుతల్లో 665 చెరువులను ఎంపిక చేసి రూ.230.74 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు.
ఆయకట్టు స్థిరీకరణ
కరీంనగర్ జిల్లాలోని చెరువులు, కుంటల కింద వాస్తవానికి 51,502 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉండేది. కానీ, మిషన్ కాకతీయ కింద పునరుద్దరణ, కాళేశ్వరం జలాల రాకతో ప్రస్తుత ఆయకట్టు విపరీతంగా పెరిగింది. మూడేళ్లలో 1.60 లక్షల ఎకరాలకు చెరువులు, కుంటల ద్వారా రెండు పంటలకు, ప్రధానంగా యాసంగి పంటలకు సాగు నీరు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ మూడు రెట్ల ఆయకట్టు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి మెట్ట ప్రాంతాలైన గంగాధర, రామడుగు, చిగురుమామిడి, గన్నేరువరం, సైదాపూర్, తిమ్మాపూర్, తదితర మండలాల్లో ఎక్కువగా ఆయకట్టు పెరగడంతో ఈ ప్రాంత రైతులు సాగు నీటి కోసం గతంలో పడిన కష్టాలన్నీ మర్చి పోయారు. ఒకప్పుడు ఒక్క పంట తీయడమే కష్టంగా ఉన్న చిగురుమామిడి వంటి మండలంలోని పలు గ్రామాల్లోని బావుల్లో ఇప్పుడు చేతికి అందే స్థాయిలో నీటి మట్టం పెరిగింది. ఫలితంగా రైతులు ఏడాదిలో రెండు పంటలు సాగు చేసి పుట్ల కొద్ది ధాన్యం పండిస్తున్నారు.
ఎప్పుడూ నీళ్లుంటున్నయ్
మాకు కోరుకుంట చెరువుల మస్తు పూడిక ఉండేది. ఎండకాలానికి ముందే ఎండిపోయేది. మాకు చెరువు కింద మూడెకరాలున్నా యాసంగిల పంట ఏయకపోదుం. అందుకే ఆ భూమి బీడుగా ఉండేది. మిషన్ కాకతీయ కింద ఈ చెరువును బాగు చేసిన్రు. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా ఈ చెరువుల నీళ్లు నింపుతున్నరు. ఎప్పుడు చూసినా నీళ్లుంటున్నయ్. ఇక మేం రెండు పంటలు పండిస్తున్నం. యువకులు కూడా పంటలు పండిస్తున్నరు. ఇదంతా కేసీఆర్ ఘనతనే.
-కాశవేని నరేశ్, రైతు, గోపరపల్లి(ఓదెల)
రైతుల తరలాత మారింది
మా ఊరు బూరుగుపల్లిలో దాదాపు 70 శాతం మంది రైతులు ఊర చెరువుపై ఆధారపడి సాగు చేస్తం. గతంల ఊర చెరువుల నీళ్లు లేక వానకాలం సాగు చేసి యేసంగిల బీళ్లుగా పెట్టెటోళ్లం. మా ఊరి పక్క నుంచే వెళ్తున్న వరదకాలువలో ఎడారిని తలపించేది. సీఎం కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో మా రైతుల తలరాత మారింది. గాయత్రీ పంప్హౌస్ నుంచి గోదావరి జలాలను వరదకాలువకు విడుదల చేయడంతో తూము ద్వారా మా ఊరి చెరువులోకి వస్తున్నయ్. దీంతో ఏడాది పొడవునా మా ఊర చెరువుల నీళ్లుంటున్నయ్. మేం వర్షాల కోసం చూడకుండా పంటలు సాగు చేసుకుంటున్నం. వానకాలం పంటకు సాగు నీరు అందని పరిస్థితి నుంచి యేసంగి పంటలను కూడా సాగు చేసుకుంటున్నం. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమే. మేమంతా కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– సాగి సత్యనారాయణరావు, రైతు, బూరుగుపల్లి (గంగాధర మండలం)
చివరి పంటకు నీరందింది
నాకు ఎనిమిదెకరాల భూమి ఉంది. సమైక్య రాష్ట్రంల ఉన్నప్పుడు సాగునీరు, కరెంటు లేక ఎకరం కూడా సక్కగా సాగుజెయ్యలే. పక్కనే చెరువులున్నా ఏమీ లాభం లేకపోయేది. సుక్కనీరు లేకుండె. భూములు అమ్మి కూలి పనిచేసుకున్నా బాగుండనిపించింది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సర్కారు చెయ్యవట్టి బీడు భూములకు పాణమచ్చింది. గతంల మా ఊరి చెరువుల ఎండకాలం వచ్చిందంటే నీళ్లే ఉండకపోయేది. మిషన్ కాకతీయ పథకం కింద పిచ్చిమొక్కలు తొలగించి పూడిక తీసిన్రు. మా మండలానికి మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు వచ్చినయ్. పెద్దచెరువు నిండింది. ఇప్పుడు మండుటెండలల్ల కూడా చెరువు నిండుకుండలా కనిపిస్తున్నది. ఎనిమిది ఎకరాలు సాగు చేస్తున్న. చివరి పంటకు కూడా నీరిందింది.
– కట్ట బాపురావు, రైతు, తెర్లుమద్ది, ముస్తాబాద్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా
మా జీవితాలకు వెలుగు
పదేండ్ల క్రితం వరకు పరిస్థితులు ఘోరంగా ఉండేవి. మా పల్లెల్లో నీళ్లు పాతాళంలో కనిపించేవి. ఎండకాలానికి ముందే చెరువుల్ల చుక్క నీళ్లుండకపోవు. అసలు చెరువే అన్న ఉనికి ఉండేది కాదు. నాడు నాయకులను, అధికారులను కలిసి చెరువులో పూడిక తీయాలని, వరదకాలువకు తూములు పెట్టి చెర్లను నింపాలని అడిగినా, పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ వరద కాలువకు తూములు పెట్టించడంతో మా దశ మారింది. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను బాగుచేయించిండు. వరద కాలువ తూముతో చెరువు నింపుకోవడంతోపాటు మిషన్ కాకతీయతో చెరువును బాగు చేసుకొని నీటిని నిల్వ చేసుకున్నం. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో మా జీవితాలకే వెలుగు వచ్చింది. ఇప్పుడు మా పల్లెల్లో ఎక్కడ చూసిన నీళ్లు కనిపిస్తున్నయ్. చెరువుల నిండినయ్. కరెంట్ మోటర్లు పోస్తున్నయ్. దీంతో చెరువు కింద సైతం పారకం పెరిగింది. పారకంతోపాటే వ్యవసాయం పెరిగింది. మేం సంతోషంగా ఉన్నామంటే దానికి సీఎం కేసీఆరే.
– జవిడి ప్రతాప్రెడ్డి, సర్పంచ్, పెగ్గెర్ల (కథలాపూర్ మండలం)
ఇంత ఎండల్ల నీళ్లున్నయ్..
గతంలో నల్లచెరువు అధ్వానంగా ఉండేది. తూములు, మత్తడి సరిగా లేక నీళ్లు వృథాగా పోయేవి. ఈ చెరువు బాగు కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసినమ్. ఎవరూ పట్టించుకోలె. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు మిషన్ కాకతీయ కింద మా నల్లచెరువును బాగా చేసిండు. కట్ట ఎత్తు పెంచడం వల్ల ఇప్పుడు చెరువులో నీళ్లు ఎక్కువ నిల్వ ఉంటున్నయ్. పంటలకు సకాలంలో నీళ్లు అందుతున్నయ్. రెండు పంటలు పండుతున్నయ్. ఇంత ఎండల్ల కూడా నీళ్లున్నయ్. సీఎం కేసీఆర్ దయవల్లే రైతుల కష్టాలు తీరినయ్. ఆ సారుకు మేమంతా రుణపడి ఉంటం.
-ఆషాడపు రాజయ్య. రైతు (కాల్వశ్రీరాంపూర్)
అయినా చెర్ల నీళ్లున్నయ్
గంభీరావుపేట నమాజ్ చెరువు ఎండకాలం వచ్చిందంటే చుక్క నీరు లేక ఎడారిగా అయ్యేది. మూగ జీవాలకు నీళ్లు తాగిద్దామన్నా నీళ్లుండేటియి కాదు. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ సారు ముందుచూపుతో చెరువులను మరమ్మతు చేయించిండు. మిషన్ కాకాతీయ కింద నమాజ్ చెరువులో పూడిక తీసిన్రు. తూములు, కట్టను మంచిగా చేసిన్రు. ఇగ చుక్క నీరు వట్టిగా పోతలేదు. ఆయకట్టు కింద వానకాలం, యాసంగి రెండు పంటలు పండుతున్నయ్. అయినా ఎండల్ల చెర్ల సగం నీళ్లున్నయ్. కేసీఆర్ సారు గిట్ల జేత్తడని ఎన్నడూ అనుకోలె.
– కంటె కిష్టయ్య, రైతు (గంభీరావుపేట)
రైతుల కష్టాలు పోయినయ్
నాకు మా ఊరు ఊర చెరువు కింద మూడెకరాల భూమి ఉన్నది. గతంల మా చెరువుల మస్తు పూడిక ఉండేది. రెండు వానలకే నిండేది. మళ్ల తొందరగా ఎండిపోయేది. యాసంగిల చాలా మందిమి పొలాలను వేయక భూములను పడావుగా ఉంచేది. తెలంగాణ గవర్నమెంట్ అచ్చినకం మా చెరువును మిషన్ కాకతీయ కింద బాగు చేసింది. అప్పటి సంది ఏ కాలమైనా చెర్ల నీళ్లుంటున్నయ్. ఎండకాలంల కూడా పుష్కలంగా నీళ్లుంటున్నయ్. సీఎం కేసీఆర్ సారు దయవల్లే రైతుల కష్టాలు పోయినయ్.
-మద్దెల నర్సయ్య, రైతు, కొలనూర్(ఓదెల)
గుంట పొలం ఎండలే..
నాడు ఎవుసం జెయ్యాలంటే తాతలు యాదికొచ్చేది. పొలానికి నీళ్లు లేక అరిగోసపడ్డం. బోరు చాలు జేత్తే మడికూడా నానకపోయేది. నీళ్లులేక నాకున్న నాలుగెకరాలల్ల ఎకరంనర వరి ఏత్తే పది గుంటల ఎల్లే వడ్లు కూడా ఎల్లలేదు. చెరువున్నట్టే కానీ, నీళ్లులేక.. కాలం గాక పొలం పనిమీద రోత పుట్టింది. కేసీఆర్ సారు పుణ్యమా అని మిషన్ కాకతీయ జెయ్యబట్టి చెరువులకు నీళ్లొచ్చినయ్. మల్లన్న సాగర్ నుంచి వచ్చిన నీళ్లతో పెద్ద చెరువు నిండింది. ఏసిన నాలుగు ఎకరాలకు నీళ్లచ్చినయ్. పంట బాగా పండింది. ఎండకాలంలనే పెద్ద చెరువు మత్తడి దుంకింది. నీళ్లు ఫుల్ ఉన్నయ్. పంటకు ఢోకాలేదు.