అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు 48 గంటల ముందే నిలిపేయాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకే బంద్ అయింది. నెల రోజుల నుంచి జోరుగా సాగిన ప్రచారం, ఆఖరి రోజూ హోరెత్తింది. రోడ్ షోలు, భారీ ర్యాలీలు, సభలతో ఎక్కడ చూసినా రాజకీయ వేడి కనిపించింది. అయితే, ఆది నుంచీ ప్రజల మధ్యే ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు అప్పుడే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో అభ్యర్థులను ప్రకటించగా, అప్పటి నుంచే రంగంలోకి దిగారు. నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ.. ప్రతి గడపనూ తడుతూ జనంతో మమేకమయ్యారు. తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధిని.. తాము గెలిస్తే చేయబోయే పనులు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఇటు ప్రగతి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి జోష్ నింపారు.
కాంగ్రెస్ పాలనలో అనుభవించిన కష్టాలు, నాడు కరెంట్, సాగునీరు లేక పడ్డ గోసలు, ఇప్పుడు మళ్లీ కరెంట్పై దొంగ మాటలు, ధరణి, రైతుబంధుపై కుట్రలు.. బీఆర్ఎస్ పాలనలో విజయాలు, 24గంటల కరెంట్, ధరణి, రైతుబంధుతో జరుగుతున్న మేలును కేసీఆర్ తన ప్రసంగాల్లో వివరిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం, ప్రధానంగా ఆగమాగమై ఓటేస్తే జరిగే పరిణామాలు, ఆలోచించి వేస్తే కలిగే ప్రయోజనాలను వివరించగా, ప్రతి గ్రామంలోనూ జోరుగా చర్చిస్తున్నారు. అధినేత చెప్పిన విషయాలను అంగీకరిస్తూ.. సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఇటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభలు, రోడ్షో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు.
– కరీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ధీమాతో కనిపిస్తున్నారు. సుమారు నెల పాటు ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేశారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను చెబుతూనే కొత్తగా చేపట్టే పనులను మ్యానిఫెస్టో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.
దీనికి తోడు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నిర్వహించిన సభలు, రోడ్ షోలు కూడా విజయవంతం కావడం, ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం, బీఆర్ఎస్ నేతలు చెప్పిన విషయాలను ప్రజలు సానుకూలంగా స్వీకరించడం వంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ధీమాతో కనిపిస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ)
మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం హోరెత్తింది. బీఆర్ఎస్తో ప్రధానంగా పోరాడుతున్న కాంగ్రెస్, బీజేపీల కంటే వినూత్న రీతిలో, నిత్యం ప్రజల మధ్యన ఉండి గంగుల ప్రచారం చేశారు. హ్యాట్రిక్ విజయాలు సాధించిన గంగుల కమలాకర్ మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపారు. తాను చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు చక్కగా వివరించగలిగారు.
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్ అభివృద్ధికి ఒక్క పైసా తేలేదని, కరీంనగర్ అభివృద్ధి తనతోనే సాధ్యమైందని ప్రజలకు వివరించగలిగారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కొనసాగాంటే తన గెలుపు తప్పనిసరి అని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మంత్రి గంగులపై, బీఆర్ఎస్పై ఎదురుదాడి చేయడం తప్ప వాళ్లు చేసిందేమీటో చెప్పుకోలేక పోయారు. ఈ రెండు పార్టీలు గంగులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ప్రజలు ఈసడించుకునే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ఎన్నికల షెడ్యూల్కు ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడం, మంత్రి గంగులకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
ఈ సభలో రూ.2,500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నియోజకవర్గ ప్రజలకు నివేదించగలాగారు. ఆ తర్వాత పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో నిర్వహించిన భారీ బహిరంగ సభ కూడా సక్సెస్ కావడం, కరీంనగర్ అభివృద్ధి విషయంలో కేసీఆర్ పలు హామీలు ఇవ్వడం.. తన గెలుపుకు దోహద పడుతుందని గంగుల ధీమాతో కనిపిస్తున్నారు.
బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గ్రాఫ్ క్రమంగా తగ్గిపోయింది. మొదట్లో బీఆర్ఎస్కు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నదని ఈ పార్టీల నాయకులు ఎవరి వారే ప్రచారం చేశారు. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్రావు వంటి నాయకులు ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సామాన్యులకు అర్థమయ్యే విధంగా వివరించగలిగారు. కరెంట్, ధరణిపై ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టగలిగారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే జరిగే పరిణామాల గురించి ప్రజలకు వివరించగలిగారు.
ముఖ్యమంగా ఆయా నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు జిల్లా ప్రజల్లో ఆలోచనలు రేకిత్తించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు చేసింది ఏమీ లేదని చెబుతూనే పదేళ్లలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి సభలో కేసీఆర్ వివరించారు. ఓటర్లలో క్రమంగా మార్పునకు దోహద పడింది. బీఆర్ఎస్ గెలిస్తేనే తమ బతుకులు బాగు పడతాయని భావన ముఖ్యంగా కరెంట్ విషయంలో కాంగ్రెస్ రేపుతున్న గందర గోళ పరిస్థితిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని, ధరణిని తొలగిస్తారనే విషయాలను రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీల గ్రాఫ్ క్రమంగా తగ్గి బీఆర్ఎస్ గెలుపు బాట పట్టింది.
మానకొండూర్ నియోజకవర్గంలో రెండు సార్లు ఘన విజయం సాధించిన రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ విజయం వైపు అడుగులు వేస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే రసమయి బాలకిషన్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కూడా పెద్ద మొత్తంలో నిధులు తెచ్చారు. నిధులు మంజూరై ప్రారంభించని పనులు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ విషయాలను రసమయి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగలిగారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తోంది.
అయితే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన అకృత్యాలను సభలు, సమావేశాల్లో రసమయి చక్కగా వివరిస్తూ వచ్చారు. దీనికితోడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తిమ్మాపూర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ఎస్సీ నియోజకవర్గమైన మానకొండూర్లో ఉన్న దళితులందరికి ఒకేసారి దళితబంధు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రసమయి గెలుపు కోసం నియోజకవర్గంలోని దళితవాడల్లోకి వెళ్లి బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది బాగా పనిచేసిందనే భావన రసమయిలో కనిపిస్తోంది. మొత్తానికి హ్యాట్రిక్ విజయం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ బీజేపీ నుంచి పోటీలో ఉన్నా అంతగా ప్రభావం కనిపించడం లేదు. త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ మాత్రం తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తన నియోజకవర్గాన్ని రూ.1,800 కోట్లతో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశానని ప్రజలకు వివరించగలిగారు.
ఒకప్పుడు కరువు సీమగా ఉన్న చొప్పదండిని కోన సీమగా మార్చానని, తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించగలిగానని ఓటర్లకు చెప్పగలిగారు. అంతే కాకుండా, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ, చొప్పదండి పట్టణంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించి పలు హామీలు ఇచ్చారు. తన గెలుపునకు ఈ హామీలు దోహద పడతాయనే ధీమాలో రవిశంకర్ కనిపిస్తున్నారు. తాను ఒక్కడినే స్థానికుడినని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని రవిశంకర్ చేసిన ప్రచారం బాగా పనిచేసింది.
హుజూరాబాద్లో మొదట గట్టి పోటీ ఎదుర్కొన్న బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌడిక్రెడ్డి క్రమంగా తన గెలుపును సునాయాసం చేసుకున్నారు. తనదైన రీతిలో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించడం, సంక్షేమ పథకాల వల్ల పేదలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కౌశిక్రెడ్డి గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తున్నా కౌశిక్కే గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జమ్మికుంటలో మంత్రి హరీశ్రావు రోడ్ షో, ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ కావడం,
హుజూరాబాద్లో మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోకు కూడా భారీగా జనాలు తరలిరావడంతో ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన హేమా హేమీలు వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించినా ప్రజలు ఆశించిన రీతిలో రిసీవ్ చేసుకున్నట్లు కనిపించడం లేదు. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ను ఎలాగైనా ఈసారి ఓడించాలని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో గెలుపు తనదేనన్న ధీమా పాడి కౌశిక్రెడ్డిలో కనిపిస్తోంది.
ప్రచారం చివరి రోజైన మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ ర్యాలీ తీశారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్, తెలంగాణతల్లి చౌరస్తా, టవర్సర్కిల్ మీదుగా రాజీవ్చౌక్ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. చొప్పదండిలోని పలు వార్డుల్లో సుంకె రవిశంకర్ ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుంచి మండలకేంద్రం వరకు 17 కిలోమీటర్ల దూరం రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు.