మంథని/మంథని రూరల్, జనవరి 13: ప్రభుత్వ ఖజానాలో నిధులు లేక పోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంథనిలో శనివారం ఆయన పర్యటించారు. ముందుగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణీ-శ్రీనివాస్ ఇంట్లో తేనేటి విందును స్వీకరించారు. తర్వాత మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలో సినిమా థియేటర్ను ప్రారంభించారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో మంథని మండలానికి చెందిన 17 మంది, కమాన్పూర్ మండలానికి చెందిన నలుగురికి, రామగిరి మండలానికి చెందిన ఇద్దరికి, పాలకుర్తి మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. బోయినిపేటలోని శ్రీ లక్ష్మీదేవర ఆలయంలో పూజలు చేశారు. మంథని మండలం నాగారంలో నూతన పంచాయతీ భవనం, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డును ప్రారంభించి, మంత్రి మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్కు పట్టంగట్టడం చాలా సంతోషంగా ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10లక్షల వైద్య సదుపాయం కల్పించామని వివరించారు.
త్వరలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు గృహాజ్యోతి పథకం ద్వారా మంజూరు చేస్తామని, ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తానని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కొండ శంకర్, శశిభూషన్కాచే, వొడ్నాల శ్రీనివాస్, పెండ్రు రమాదేవి, బూడిద మల్లేశ్, తోట్ల తిరుపతియాదవ్, రాజు ఉన్నారు.