Putta Madhukar | మంథని, మార్చి 12: స్థానిక పోచమ్మవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్ ఆత్మహత్యకు మంత్రి శ్రీధర్బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. స్థానిక పోస్టుమార్టం గది వద్ద ఉన్న సతీష్ మృత దేహాన్ని పుట్ట మధూకర్ గురువారం ఉదయం సందర్శించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు సతీష్ ఆత్మహత్యకు పాల్పడిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విలేకరుల సమావేశంలో పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. పెరుగు సతీష్ 25రోజుల క్రితం ఏసీపీ మడత రమేష్ పిలిచి ఇబ్బందులకు గురి చేయడం వల్లనే పురుగుల మందు సేవించి 25రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఇది దురదృష్టకరమైన సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే అమ్మాయి ఇబ్బంది పెడుతుందని చెప్పిందో ఆ ఆమ్మాయి లేకుండానే ఏసీపీ ఏకపక్షంగా ఇబ్బంది పెట్టడం మూలంగానే తమ్ముడు మందు సేవించాడని సతీష్ సోదరి చెబుతోందని చెప్పారు. పోస్టుమార్టం వద్దకు మృతదేహాన్ని తీసుకువచ్చి ఉదయం తొమ్మిది గంటలవుతున్నా కూడ ఇప్పటి వరకు ఎస్సై ఇక్కడికి వచ్చి బాధితుల నుండి దరఖాస్తు తీసుకోలేదని మండిపడ్డారు. మేం చెప్పినట్లే దరఖాస్తు రాసి ఇవ్వాలని రామగుండం పోలీసులు హుకూం జారీ చేయడమేంటని పుట్ట మధూకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామగుండం పోలీసులను అనేక మార్లు హెచ్చరించామని, మీరు ఉద్యోగులు ఉద్యోగం చేసుకోవాలే తప్ప రాజకీయాలు చేయవద్దని సూచించారు. ఇలాంటే వ్యవహరమే పోలీసులు ప్రదర్శిస్తే భవిష్యత్లో పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ కార్యాలయాలని బోర్డులు పెట్టుతామని హెచ్చరించారు. అమాయకుల చావులకు కారణమవుతున్న వారిని ఎవరిని వదలిపెట్టమని, ఏసీపీ, మంథని సీఐలు ఎక్కడ ఉన్నా వారిపై చర్యలు తప్పవని, వారి పేర్లు పింక్ బుక్కులో రాసిపెట్టుకున్నామన్నారు. నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్, ఆయన తమ్ముడు ఆడిచ్చినట్లు ఆడుతున్నారన్నారని విమర్శించారు.
సొంత పార్టీకి చెందిన కార్యకర్తలకు సమస్య ఎదురైతే మంత్రే స్వయంగా దగ్గరుండి పరిష్కరించాల్సింది పోయి పోలీసుల జోక్యం ఎందుకు అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంటే ఆయనకు ఎలాంటి గౌరవం లేదనడానికి సతీష్కు జరిగిన సంఘటనే ఒక నిదర్శనంగా నిలిచిందన్నారు. ఓ బీసీ బిడ్డగా ఈ మట్టిలో పుట్టిన తాను ఈ సమాజాన్ని చూసి పెరిగానని, తాను పదవుల కోసం ఓట్ల కోసం పని చేయడం లేదన్నారు. బీసీ సమాజాన్ని ఓట్ల కోసం దుద్దిళ్ల కుటుంబం ఎలా వాడుకుంటుందో అర్థం అయ్యేలా పోరాటం చేస్తున్నానన్నారు. ఇటీవల సూరారంలో రామకృష్ట అనే వ్యక్తి చనిపోతే అక్కడి డీఎస్పీ అవహేళనగా మాట్లాడారని పుట్ట మధూకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
30ఏండ్ల అనుభవం ఉన్న ప్రజాప్రతినిధిగా తాను మాట్లాడితే ఆ అధికారి సదరు వ్యక్తి చావుకు విలువ లేకుండా మాట్లాడాడని, ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ తయారైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే రాజకీయ కుట్రలో పోలీసుల అరాచకాల్లో చనిపోతున్నారని, ఇక్కడ సతీష్ చావుకు దుద్దిళ్ల శ్రీధర్ ఆయన కుటుంబం పోలీసు యంత్రాంగమే కారణమన్నారు. తక్షణమే పోలీసులు బాధితుల దరఖాస్తును స్వీకరించి విచారణ చేపట్టాలని, అలాగే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ సైతం తక్షణమే స్పందించి పోలీసులు జోక్యంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సతీష్ మృతి చెందక ముందే హెచ్ఆర్సీలో కేసు పెట్టినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారన్నారు.
మంథని పోలీసులు సైతం వెంటనే ఫిర్యాదు తీసుకోవాలన్నారు. దీని కోసం అవసమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, సతీష్ కుటుంబానికి అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్గౌడ్, తగరం శంకర్లాల్, మంథని లక్ష్మణ్, పుప్పాల తిరుపతి, సాగర్, పిల్లి సత్తన్న, కనకరాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు.