కరంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 2 : తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారబోతున్నదని, అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 9వ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ సదస్సుకు రెండో రోజు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ప్రజలు తెలంగాణకు వచ్చి వైద్యం చేసుకునే విధంగా వైద్య సేవలు అందించాలన్నారు.
ప్రజలు వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన్ననలు పొందాలని సూచించారు. సాంకేతికంగా దినాదినాభివృద్ధి చెందుతున్న రోబోటిక్, లేజర్, ల్యాప్రోస్కోపిక్, మైక్రో సర్జరీలతో ఒక్కరోజులోనే రోగి పూర్తిగా కోలుకుని నడిచే వైద్యం అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలో 1400 మంది ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైద్య సేవలందించాలని కోరారు. 50 కిలోమీటర్లకో ట్రామా సెంటర్ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఆరోగ్యశ్రీలో ఉన్న 5 లక్షల పరిమితిని 10 లక్షలకు పెంచామన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ, వైద్య వృత్తి పవిత్రమైందని, నమ్మకంతో వస్తున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానల్లో మోకాలు కీళ్ల మార్పిడి లాంటి అధునాతనమైన శస్త్ర చికిత్సలు అందిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్ మాట్లాడుతూ, గతంతో పోలిస్తే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అధునాతనమైన వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మోతీలాల్, కార్యదర్శి డాక్టర్ బంగారి స్వామి, రాంరెడ్డి, వెంకట్రెడ్డి, వంశీ, వీరారెడ్డి, శ్రీనివాస్, రమాకాంత్, నర్సింహులు, రజినీప్రియదర్శిని, విజయలక్ష్మి పాల్గొన్నారు.