వేడుకల్లో అమాత్యులు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు పండుగలా నిర్వహించనున్నారు. మొదటి రోజు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాలలో మంత్రి ఈశ్వర్, పెద్దపల్లిలో మండలి చీఫ్ విప్ భానుప్రసాద్రావు అమరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాలను ఎగురవేయనున్నారు. అనంతరం ఆయాచోట్ల దశాబ్ది ఉత్సవ సందేశం ఇవ్వనున్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు! ఉద్యమ నేత కేసీఆర్ సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన రోజు! నేడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం! తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగిడుతున్న వేళ దశాబ్ది పండుగకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 22 రోజులపాటు రోజుకో తీరున కార్యక్రమాలు నిర్వహించనుండగా, ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శుక్రవారం ఉదయం తెలంగాణ అమరులకు నివాళులర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనుండగా, ఈ మేరకు జిల్లాల వారీగా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించింది.
– కరీంనగర్, జూన్1(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడి నేటితో తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 2 నుంచి 22వ తేదీ దశాబ్ది ఉత్సవాలు జరగాలన్న సీఎం కేసీఆర్, ఒక్కో రోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేలా చూడాలని షెడ్యూల్ను విడుదల చేయగా, ఈ మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ వెలుగులు, సంబంధిత శాఖకు సంబంధించిన ఫ్లెక్సీలు, చేపడుతున్న పథకాలను వివరించే అంశాలతో కూడిన నమూనాలను, ఛాయాచిత్రాలను ఏర్పాట్లు చేశారు.
రాజన్న సిరిసిల్లలో కేటీఆర్
సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గురువారం రాత్రికే జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. శుక్రవారం ఉద యం 8.30గంటలకు నేతన్న చౌక్ వద్ద అమర వీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. తొమ్మిది గంటలకు సమీకృత కలెక్టరేట్కు చేరుకుని 9.02 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 9.40గంటలకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై టేబుల్ బుక్ను విడుదల చేస్తారు. 9.50 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి తేనేటి విందులో పాల్గొననుండగా, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో అధికారులు కలెక్టరేట్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల నేప థ్యంలో ఉదయం 10గంటలలోపు బయటి కార్యక్రమాలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. కలెక్టరేట్తోపాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ముస్తాబు చేశారు. జిల్లా అధికారులంతా ఉదయమే కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించిన అనంతరం కలెక్టరేట్లో జరిగే వేడుకలకు హాజరవుతారు.
కరీంనగర్లో మంత్రి గంగుల
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలతో ఉత్సవాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు నగరంలోని అమరుల స్తూపం వద్ద మంత్రి గంగుల కమలాకర్, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పిస్తారు. ఉదయం 9.02 గంటలకు మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.25 వరకు మంత్రి సందేశం ఇస్తా రు. 9.25 నుంచి 9.45 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండగనుండగా, 9.45 నుం చి 9.55 గంటల వరకు అమరుల కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ శాఖల ద్వారా ఆస్తుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. కాగా, జిల్లాలోని తమ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, డీసీసీబీ చైర్మన్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఎంపీపీ కార్యాలయాల్లో ఎంపీపీలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు.
జగిత్యాలలో కొప్పుల
ఉదయం 8:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్ నివాళులర్పిస్తారు. 9 గంటలకు సమీకృత కలెక్టరేట్లో మంత్రి కొప్పుల పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. దశాబ్ది ఉత్సవాల సందేశాన్ని ఇస్తారు. కాగా, ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఖిల్లా, చారిత్రక ప్రదేశాలు, ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.
పెద్దపల్లిలో భానుప్రసాద్రావు
మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్రావు సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ముందుగా ఉదయం 8.45గంటలకు పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుంటారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి అక్కడి అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 8.58గంటలకు కలెక్టరేట్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గౌరవ వందనం స్వీకరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.