సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 28 : విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి విజేతలుగా నిలువాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తానని జూలైలో సిరిసిల్లలో ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నానని స్పష్టం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన, ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, గంభీరావుపేట, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల, కేజీబీవీల్లో చదివే దాదాపు 2100 మంది ఇంటర్ విద్యార్థులకు మంత్రి ట్యాబ్లు అందించారు. ఈ సందర్భంగా అక్కడే ఎర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘మన ఉరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తూ గుణాత్మక విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇటీవలే గంభీరావుపేటలో కేజీ టూ పీజీ సముదాయాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పేద విద్యార్థుల మోములో ఆనందాన్ని చూసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 86 వేల విలువగల ఆకాశ్, బైజూస్ సాఫ్ట్వేర్ పొందుపరిచిన ట్యాబ్లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. మార్కెట్లో ట్యాబ్ విలువ 10 వేలు కాగా, మెటీరియల్ 76 వేలు అవుతుందని వివరించారు. ఐఐటీ, నీట్, ప్రభుత్వ పోటీ పరీక్షలతోపాటు ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ట్యాబ్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, కేవలం చదువుల కోసమే ట్యాబ్లను వాడాలని సూచించారు. అతి త్వరలో వేములవాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే దాదాపు మూడు వేల మంది విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మంచి ర్యాంకులు సాధిస్తే తమకు ట్యాబ్లు పంపిణీ చేసిన తృప్తి మిగులుతుందన్నారు. ఇంత విలువైన ట్యాబ్లను మీకు అందిస్తున్నామని, మీరు బాగా చదువుకుంటే మేమంతా సంతోష పడుతామని అన్నారు.
సిరిసిల్ల జిల్లా దేశానికే ఆదర్శం
రాజన్నసిరిసిల్ల జిల్లాను దేశంలోనే ఆదర్శ జిల్లాగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని 550 జిల్లాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్లో రాజన్న సిరిసిల్ల తొలిస్థానంలో నిలువడం మన అందరికీ గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతితోపాటు అధికారులను అభినందించారు. ఇదే ఒరవడితో జిల్లా యంత్రాంగం ముందుకు సాగాలని తెలిపారు. జిల్లా అబివృద్ధికి కృషి చేస్తున్న అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని, దురుసుగా వారి మనసు నొప్పించేలా వ్యవహరించవద్దని సూచించారు.
దోస్తుకు దోచిపెడున్నది.. దేశమంతా చూస్తున్రు
కార్పొరేట్ దోస్తుకు దోచిపెడుతున్నది, దోపిడీని వాటాలుగా తీసుకుని పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చుతున్నది దేశమంతా చూస్తున్నారని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వెంకటాపూర్, బొప్పాపూర్ గ్రామపంచాయతీల భవనాలను ప్రారంభించి, మాట్లాడారు. పెన్షన్లు రాని అర్హులకు తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. నాడు రాష్ట్రంలో 29 లక్షల మందికి కేవలం రూ.200ల చొప్పున ఇవ్వగా, ప్రస్తుతం 45 లక్షల మందికి రూ.2 వేలు, రూ.3వేలు ఇస్తున్నట్లు చెప్పారు. నాడు సంవత్సరం మొత్తం అయిన పెన్షన్ల ఖర్చు రూ.800 కోట్లు అయితే, ప్రస్తుతం రూ.12 వేల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికీ నీళ్లిచ్చే పని, కాళేశ్వరం ద్వారా నీళ్లను తెచ్చి మానేరుకు జలకళ తెచ్చే పని ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల కష్టం, ఆర్తి తెలిసిన నాయకుడు కేసీఆర్ రూపంలో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే ఇన్ని పనులు చేసుకోగలిగామని ధీమాగా చెప్పారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నూటపదహార్లు ఇయ్యాలనే సంస్కారవంతమైన ఆలోచన ఎందుకు చేయలేదని, కేసీఆర్ కిట్టులా ఇద్దామనే సోయి ఎందుకు రాలేదని మండిపడ్డారు.
మతం పేరు మీద చిల్లరమల్లర మాటలు మాట్లాడే వారిని నమ్మవద్దని సూచించారు. వెంకటాపూర్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్లెక్సీలు కట్టిపెడుతామని, కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీగా ఏం చేశావో చెప్పగలవా? అని సవాల్ విసిరారు. ఏమన్నా అంటే “అండ్ల ఆరు పైసలు మావే” అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదిన్నరేళ్లలో మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది రూ.3.70 లక్షల కోట్లు అని, మనకు వాపసు ఇచ్చింది కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమేనని, ఒక వేల ఇది నిజం కాదని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చేసిన పని చెప్పకుండా మసీదులు తవ్వుతామని, సెక్రటేరియట్ కూల్చుతామని ఓ ఎంపీ మతతత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. సిరిసిల్లను జిల్లాను చేసి, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు, అనేక కార్యాలయాలు, సంస్థలు తెచ్చి పాలనా సౌలభ్యాన్ని కల్పించామన్నారు. నరేంద్ర మోదీ రాష్ర్టానికి ఏం చేశాడని ఆయన దేవుడని ప్రశ్నించారు. “మోదీ దేవుడెట్లయితడు సిలిండర్, పెట్రోలు ధరలు పెంచినందుకు దేవుడవుతడా?” అని ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ ఇయ్యకుండా, తెలంగాణకొక్క విద్యాసంస్థ కూడా ఇవ్వనందుకు, ఢిల్లీలో 700ల మంది రైతులను చంపించినందుకు దేవుడవుతడా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీని వేటకుక్కల వలె పంపడం ఆనవాయితీగా మారిందన్నారు. ఆనాడు ప్రధాని మన్మోహన్ కాలంలో రూపాయి విలువ పడిపోయిందని గగ్గోలు పెట్టిన మోదీ నేడు అంతకు మించి పడిపోయిందని, దీన్ని బట్టి ఎవరు అసమర్థ ప్రధాని అని ప్రశ్నించారు. మతం, కులం పేరు చెప్పి రెచ్చగొట్టి మాట్లాడితే ఓట్లు పడే రోజులు పోయాయని, ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడగాలని ప్రభుత్వాన్ని, కేసీఆర్ను విమర్శించే నాయకులకు హితవు పలికారు. అంతకు ముందు ఇతర పార్టీలకు చెందిన 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు.
మత చిచ్చు పెట్టేవారిని నమ్మద్దు
కుల, మతాల పేరుతో చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నవారిని నమ్మవద్దని, వారిని ఓ కంట కనిపెట్టాలని సూచించారు. “బొప్పాపూర్, గొల్లపల్లి చిరకాల వాంఛ సింగసముద్రానికి శాశ్వతంగా జలకళ ఉండాలె. ఎప్పటికీ వ్యవసాయం కలకల లాడుతూ.. చెరువుల్లో చేపపిల్లలు దుంకుతూ.. అందులో నుంచి నీళ్లు వ్యవసాయానికి అందుతూ ఉండాలె.” అని ఆకాంక్షించా రు. కరెంటు, సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమవుతున్నాయని, సిరిసిల్లలో పోటీ చేసేందుకు ఎంతో మంది వస్తున్నారని, బొప్పాపూర్కు ఏం చేశారో వారిని ప్రజలు అడగాలని కోరారు. తాము గ్రామానికి రూ.38 కోట్ల విలువైన పనులు చేయగలిగామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో అడగాలని ప్రజలకు సూచించారు. కొన్ని రోజులుగా కొందరు సెక్రటేరియట్, ప్రగతి భవన్ను, మసీదులను కూలగొడతమంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, తాము కట్టే పని చేస్తుంటే వారు కూలగొట్టే ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.
సమావేశం అనంతరం అదే గ్రామంలో సామాజిక కార్యకర్త చిదుగు గోవర్ధన్గౌడ్ రూ.60 లక్షల సొంత ఖర్చుతో వేంకటేశ్వరాలయం నిర్మిస్తున్న విషయం తెలుసుకుని ఆయనను శాలువాతో సన్మానించారు. అలాగే, గోవర్ధన్గౌడ్ విజ్ఞప్తి మేరకు ఆలయానికి వెళ్లేందుకు సీసీ రోడ్డును మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి, ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి, ఉపసర్పంచ్ వంగ హేమలత, గడ్డినర్సయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, డీఐజీ రమేశ్ నాయుడు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి ఏ రమేశ్, డీఐఈవో మోహన్కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక,జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, స్థానిక నేతలు, ఆయా మండ లాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సెస్ డైరెకర్లు పాల్గొన్నారు.