రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రైతుకు పంట పెట్టుబడి కింద రైతుబంధుతో పాటు రైతు బీమా, ఉచిత కరెంటు, నీటి సౌకర్యం వంటి అనేక సౌకర్యాలతో వెన్నుదన్నుగా నిలుస్తున్నది. సాగులో ఇబ్బందులు లేకుండా ఎప్పటి కప్పుడు వ్యవసాయ అధికారులతో సలహాలు, సూచనలు ఇస్తున్నది. మరోవైపు సాగులో దన్నుగా నిలిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీరాజరాజేశ్వర, ఎగువ మానేరు, మల్కపేట జలాశయాలున్నందున మంత్రి కేటీఆర్ జిల్లాకు వ్యవశాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాలలను మంజూరు చేయించారు. సిరిసిల్ల అర్బన్ మండలంలోని సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కోసం 11 ఎకరాల్లో 8 కోట్లతో భవనాలు నిర్మించారు. ఈ కళాశాలను 2017లో మంత్రి కేటీఆర్, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుత శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. అంతే కాకుండా ఆచార్య జయశంకర్ వ్యవసాయ కళాశాలను సైతం మంత్రి కేటీఆర్ మంజూరు చేయించారు.
నేడు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం
వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించనున్నారు. అతిథులుగా శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరు కానున్నారు.
జిల్లెల్లకు నయా శోభ
నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న జిల్లెల్ల నేడు నయా శోభ సంతరించుకున్నది. ఒకనాడు సర్కారు బడి కూడా సరిగ్గాలేని ఈ గ్రామంలో ఇప్పుడు ఏకంగా వ్యవసాయ కళాశాల అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఈ కాలేజీని మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి ప్రారంభించనుండగా, విద్యుద్దీపాలతో ఇలా వెలుగులీనింది. ఇది చూసిన గ్రామ ప్రజానీకం సంబురపడుతున్నది.
2018 నుంచే తరగతులు
2018 ఆగస్టు 9న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల భవనాల సముదాయానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే ఏడాది పీజీటీఎస్ఏసీ ఆధ్వర్యంలో ఎంసెట్ ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం కాగా, సర్దాపూర్లోని వ్యవసాయ పాలిటెక్నిల్ కళాశాలలో తరగతులను ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో 56 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, వారు 2022 ఆగస్టులో వ్యవసాయ డిగ్రీలో పట్టభద్రులయ్యారు. ఒక బ్యాచ్ పూర్తి కాగా, ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్లో 190 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కొత్త భవనంలోకి మార్చిన తర్వాత మరిన్ని కోర్సులతోపాటు ప్రతి విభాగంలో 120 సీట్లకు అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రస్తుతం 23 మంది బోధన, 19 మంది బోధనేతర సిబ్బంది ఈ డిగ్రీ కళాశాలలో సేవలు అందిస్తున్నారు.
ఆధునిక హంగులతో నూతనప్రాంగణం
తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనే అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థం 16 ఎకరాల్లో జీ ప్లస్ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, ఫాంలాండ్స్ను నిర్మించారు. ఆధునిక టెక్నాలజీతో నూతన ప్రాంగణాన్ని అందుబాటులోకి తెచ్చారు. అత్యాధునిక వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాలలు, సెమినార్ హాళ్లు, అధ్యాపకుల గదులు, అసోసియేషన్ డీన్ చాంబర్, మోడ్రన్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ కళాశాల రాష్ట్రంలోనే రెండోది కావడం జిల్లాకే గర్వకారణం. వ్యవసాయ కళాశాల వల్ల ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు తయారు కావడమే కాకుండా, పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరంగా మారనున్నది. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్య వ్యవసాయంలో నిర్ణయాత్మక పాత్రను పోషించే అవకాశమున్నది.
ఎడ్యుకేషన్ హబ్గా సిరిసిల్ల
కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చెందుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో విద్యారంగంలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నది. సకల సౌకర్యాలతో కూడిన ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు, ఉపాధినిచ్చే వృత్తి విద్యలోనూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసానిస్తూ సిరిసిల్లను విద్యాహారంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీఐ, నర్సింగ్, జేఎన్టీయూ కాలేజీలు వచ్చాయి. రాష్ట్రంలోనే తొలి ఫైన్ ఆర్ట్స్ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కూడా ఏర్పాటైన విషయం తెలిసిందే. రాబోయే విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం కానున్నది. దీంతో విద్యార్థులు స్థానికంగానే ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశం లభిస్తున్నది. ఒకవైపు ఎడ్యుకేషన్ హబ్, మరోవైపు పరిశ్రమల రాకతో ఇండస్ట్రియల్ హబ్గా నిలువడంతో పాటు వేలాది మందికి ఉపాధి లభించనున్నది.