రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటించారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి నిరుపేద దళితులకు ఆర్థిక దన్ను అందిస్తూ.. అడవి బిడ్డలకు పోడు పట్టాలిస్తూ ముందుకు సాగారు. కుటీర వ్యాపార పథకం కింద చిరువ్యాపారాల స్థాపన కోసం 124 మంది దళితులకు 62 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. 1614 మంది పోడు రైతుల 2859.34 ఎకరాలకు సంబంధించిన హక్కు పత్రాలను పంపిణీ చేశారు. అంతకు ముందు జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్రాం నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, కాలేజీకి జగ్జీవన్రాం పేరు పెట్టారు.
సిరిసిల్ల, జూలై 6 : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు మూడు గంటలకుపైగా మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి కలియదిరిగిన ఆయన, ముందుగా ఉదయం 11.15 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చేరుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలతో ఆప్యాయంగా మాట్లాడారు. అక్కడ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్రామ్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి ఆప్యాయంగా పలుకరించి, ఇంత గొప్ప కళాశాలలో మీరు చదువుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కళాశాలకు జగ్జీవన్ రామ్గా నామకరణం చేశారు. దీంతో విద్యార్థులు పుల్ ఖుషీ అయ్యారు. బాబూ జగ్జీవన్ రామ్ పేరును కళాశాలకు పెట్టడంతోపాటు ఇచ్చిన హామీ మేరకు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఫిదా అయ్యారు. తర్వాత మంత్రితో సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 12:10 గంటలకు అమాత్యుడు రామన్న సిరిసిల్ల కలెక్టరేట్కు చేరుకున్నారు.
దళితబంధులో భాగంగా మంజూరైన బస్సు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్, రెడిమిక్స్ యూనిట్లను ప్రారంభించారు. విభిన్నమైన ఆలోచనలతో యూనిట్లను ఎర్పాటు చేసుకున్న లబ్ధిదారులను అభినందించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాలకు చెందిన 124 మంది లబ్ధిదారులకు చిన్నతరహా వ్యాపారాల ఏర్పాటు కోసం 62 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపైకి వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం 1,614 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను మంత్రి ఈశ్వర్తో కలిసి అందించారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఆ తర్వాత లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బోయినపల్లి మండలం విలాస్సాగర్కు వెళ్లారు. ఇటీవల బీఆర్ఎస్వై సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్ తండ్రి రాజయ్య మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం 2:50గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.
కారోబార్ కుటుంబానికి అండగా..
సిరిసిల్ల రూరల్, జూలై 6 : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. గురువారం జిల్లెల్లకు వచ్చిన మంత్రిని ప్రభాకర్ భార్య జ్యోతి తన కొడుకులు జయంత్(10), అనిష్(7) కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను అనివార్య కారణాల వల్ల పరామర్శకు రాలేకపోయానని కేటీఆర్ చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. వ్యవసాయ కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. అక్కడే ఉన్న కళాశాల యాజమాన్యాన్ని ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని, ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలని సూచించారు. కొడుకుల చదవులకు సహాయం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు జ్యోతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.