రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. యువనేత ఇచ్చిన పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. కేకులు కోసి సంబురాలు చేసుకున్నారు. ఊరూరా మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేదలు, వృద్ధులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం చేసి అభిమానం చాటుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై, తమ ప్రియతమ నేత నిండు నూరేండ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి ఆధ్వర్యంలో తిమ్మాపూర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సతీశ్కుమార్ మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి ఇల్లందకుంట రామాలయంలో పూజలు చేశారు.
కరీంనగర్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఆదివారం జిల్లాలోని అనేక చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు వేడుకలు చేసుకున్నారు. కేక్లు కట్ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. కరీంనగర్లో పలువురు పేదలకు చెద్దర్లు, దుస్తులు పంపిణీ చేశారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద నేటి నుంచి తమ డివిజన్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ. 3,116 అందిస్తామని కరీంనగర్లోని 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ ప్రకటించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇల్లందకుంట రామాలయంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా జమ్మికుంట మండలం కోరపల్లి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటానని, స్కూల్, గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రకటించారు. నగరంలోని కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 800 మంది విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, మేయర్ సునీల్రావుతో కలిసి సుమారు రూ.4 లక్షల విలువైన పుస్తకాలను ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామడుగు మండలం వెలిచాలలో అనాథ పిల్లలకు ఒక రోజు భోజనానికి అయ్యే సరుకులు, దుస్తులను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వర్ రావు పంపిణీ చేశారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కలు నాటారు.