పెద్దపల్లి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రామగుండం ఎంతో అభివృద్ధి చెందింది. సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం, ఎఫ్సీఐ, జెన్కో లాంటి భారీ పరిశ్రమలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో 3 లక్షలకు పైగా జనాభా ఉన్నది. అందులో యువత కూడా ఎక్కువే. చాలా మంది ఇంజినీరింగ్ పూర్తి చేసినా.. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తున్నది. ఇక్కడికి కంపెనీలను తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉపాధి చూపాలన్న డిమాండ్ ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నా గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. కంపెనీలను తీసుకొచ్చేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత యువతకు స్థానికంగానే కొలువులు కల్పించాలనే ఉద్దేశ్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే జిల్లాలకు కంపెనీలను తీసుకొస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక చొరవతో ఐటీ టవర్, ఇండ్రస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఆదివారం అమాత్యుడు రామన్న చేతుల మీదుగా పనులకు భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో యువతీ యువకులు, నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం జిల్లా కేంద్రాలకు ఏమాత్రం తీసిపోదు. ఈ పట్ణణం ఐటీకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, అలాగే రామగుండంలో రైల్వే సేషన్ ఉండడంతో ఈజీగా రాకపోకలు సాగించే అవకాశమున్నది. హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ ప్రాంతాల నుంచి మెరుగైన రోడ్డు రవాణాతోపాటు రైల్వే సౌకర్యం ఉన్నది. దీనికి తోడుగా సింగరేణి సంస్థకు చెందిన పెద్ద డివిజన్గా ఉన్న శ్రీరాంపూర్ డివిజన్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో అక్కడి సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశమున్నది. ఇలా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉన్న రామగుండంలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తే ప్రముఖ కంపెనీలు కూడా వచ్చే వీలున్నది. ఐటీ రంగంలో ఉన్న ఈ ప్రాంత పిల్లలు కూడా ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహం చూపే ఆస్కారముంటుంది. దీంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక చొరవ చూపారు. ఇప్పటికే ఐటీ రంగాన్ని హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరిస్తుండగా, అన్ని అవకాశాలున్న రామగుండంలో ఐటీ టవర్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వెనుక 1.26 ఎకరాల స్థలంలో 30 కోట్ల వ్యయంతో మూడు అంతస్థుల్లో ఈ టవర్ను నిర్మించనున్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఇది పూర్తయి అందుబాటులోకి వస్తే దాదాపుగా 450మంది యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతున్న రామగుండంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. నట్బోల్ట్, టైర్, ఇంజిన్ ప్యాకేజీ తయారీ కంపెనీలు, గ్రీస్, బ్రిక్స్, రెడిమిక్స్, రైస్మిల్లులు, మోటర్ మెకానిక్, ట్రాక్టర్, లారీ, ట్రాలీ, ఆటో వర్షాప్లు ఇలా 300కుపైగా ఇండస్ట్రీలు ఉంటాయి. అవన్నీ గౌతమీనగర్, ఆటోనగర్ కుందన్పల్లితోపాటు ఇతర ప్రాంతాల్లో విస్తరించాయి. అయితే ఆయా ప్రాంతాల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో ఆయా పరిశ్రమల నిర్వాహకులు, అందులో పనిచేసే కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాయు, శబ్ధ కాలుష్యంతో అవస్థలకు గురయ్యారు. పట్టణంలోనే పరిశ్రమలు ఉండడంతో కొన్నిసార్లు గత్యంతరంలేని పరిస్థితుల్లో రోడ్డుపైనే పనులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయాలని దశాబ్దకాలంగా డిమాండ్ చేస్తున్నా నాటి ప్రభుత్వాలు గానీ, పాలకులు గానీ పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషితో ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాంలో 60కోట్లతో 102 ఎకరాల విశాలమైన స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఈ పార్క్లో దాదాపుగా 300 నుంచి 350 వరకు పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా ప్లాటింగ్ చేయనున్నారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీలు, అధునాతనమైన టాయ్లెట్లు, మంచినీటి వసతి కల్పించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే పరిశ్రమలన్నీ ఒక్క చోటకే చేరి ఈ ప్రాంతం ఇండస్ట్రీయల్ హబ్గా మారనున్నది. వేలాది మంది ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి.
రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ప్రధాన నగరాలతో సమానంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నాం. ఆదివారం మంత్రి కేటీఆర్ ఈ రెండింటికి వేసే పునాది రాయి నియోజకవర్గ యువతీ యువకుల, విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి చిరకాలం నిలిచి ఉండేలా భవిష్యత్త్తుకు బంగారు బాటలు పరిచేలా ఉండనున్నది. చారిత్రాత్మక అభివృద్ధికి రామగుండం నియోజకవర్గం కేంద్ర బిందువైంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ పాలనకు నిలువుటద్దంగా నిలుస్తున్నది.
-కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే