కరీంనగర్ కలెక్టరేట్/ కార్పొరేషన్, జనవరి 31: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వచ్చే ఆగస్టు 16తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దళితబంధు లబ్ధిదారులతో కరీంనగర్లో మహాసమ్మేళనం నిర్వహిద్దామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ కేటీఆర్ సూచించారు. దళితబంధు విజయగాథల పేరిట జాతరలా నిర్వహించే ఈ సమ్మేళనానికి సీఎం కేసీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిద్దామని, జాతీయస్థాయిలో పారిశ్రామికవేత్తలు, విశ్లేషకులు, ఆర్థికకవేత్తలను కూడా పిలుద్దామని చెప్పారు. లబ్ధిదారుల యూనిట్ల వద్దకు తీసుకెళ్లి విజయపరంపరను చూపే అవకాశం వారికి కల్పించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఎదుగుదలను వివరిస్తూ దేశానికే దిక్సూచిగా నిలిపేలా సక్సెస్ స్టోరీలను సిద్ధం చేయాలని సూచించారు. దళితబంధు నిశ్చయాత్మక పథకమని, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఓట్ల కోసం తెచ్చింది కాద ని స్పష్టం చేశారు. మంగళవారం కరీనంగర్లో పర్యటించిన ఆయన ముందుగా రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్’ పేరిట నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుపై కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, అమలు చేస్తున్న దళితబంధు పథకంపై సమీక్షించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 18వేల మంది వరకు ఒక్కొక్కరికీ 10లక్షల చొప్పున అందజేయగా, వారు నిర్వహిస్తున్న యూనిట్లు కొనసాగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు.
మరింత నిబద్ధతతో పనిచేయాలి
గతంలో అందించిన పథకాలు దళితుల జీవన విధానంలో ఏమాత్రం మార్పు రాలేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు ద్వారా వారిలో ఆర్థిక ఎదుగుదల మొదలైందని మంత్రి చెప్పారు. అందుకు తన అసెంబ్లీ సెగ్మెంట్లోని దేవయ్య విజయగాథే నిదర్శనమన్నారు. అతనికి పథకం ద్వారా ఆర్ధికసాయమందిస్తే 8లక్షలతో దుకాణం నిర్వహిస్తున్నాడని, మిగిలిన 2లక్షలను కూడా ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు, ప్రస్తుతం నెలకు 50 వేల నుంచి 60వేలు సంపాదిస్తున్నాడని మంత్రి వెల్లడించారు. ఏడాదికి సుమారు 6లక్షల దాకా రాబడి వస్తున్నదని, రెండేళ్లలో ప్రభుత్వం అందించిన సాయానికన్నా అధికంగా సంపాదిస్తాడని, ఆయన వ్యాపారశైలిని ఇతర లబ్ధిదారులకు వివరిస్తూ మండలాల వారీగా అధికారులు బాధ్యతలు తీసుకుని, వారిలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. 18వేల మంది లబ్ధిదారులకు 1800కోట్లు పంపిణీ చేయగా, వారు చేస్తున్న వివిధ రకాల వ్యాపారాలతో ఆ మొత్తం నేడు 2,600కోట్లకు చేరిందని, ఇదే స్ఫూర్తితో యూనిట్లు కొనసాగితే, 200 మిలియన్ల సంపాదన వారి సొంతమవుతుందన్నారు. దీనిని దేశానికే ఆదర్శంగా మార్చేందుకు మరింత నిబద్ధతతో అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తే, దళితుల ఆర్థికాభివృద్ధిని కాంక్షించిన ఈ పథకం ప్రపంచంలోనే మొదటిదవుతుందన్నారు. పలు కుల సంఘాల్లోని సభ్యులకు అందించిన ఆయా వృత్తుల యూనిట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని, చేపల పెంపకంలో రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. గొర్ల పెంపకం ద్వారా యాదవుల జీవనప్రమాణాలు కూడా మెరుగుపడి, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నారని గుర్తు చేశారు. పారదర్శకత, పక్కాగా యూనిట్ల నిర్వహణ కోసం థర్డ్పార్టీ ఆడిట్ నిర్వహించాలని కలెక్టర్కు సూచించారు.
సక్సెస్ స్టోరీలు సిద్ధం చేయాలి
హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారుల ఎదుగుదలను వివరిస్తూ సక్సెస్ స్టోరీలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు మంత్రి కేటీఆర్ సూచించారు. పథకంతో దళితుల జీవితాల్లో వచ్చిన మార్పులతో డాక్యుమెంటరీలు రూపొందించాలని, ఇవి దేశానికి దిక్సూచిగా నిలువాలని చెప్పారు. సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చే లాల్బహుదూర్శాస్త్రి అకాడమీలో కూడా ఈ పథకం విజయవంతంగా అమలవుతున్న తీరుపై ప్రజంటేషన్ చేయాలని సూచించారు. ఈ పథకం క్షేత్రస్థాయిలో పూర్తిగా సద్వినియోగమవుతున్న తీరుపై డాక్యుమెంటరీలు తీసి, ప్రదర్శిస్తూ ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించాలని, దీనిద్వారా దళితులపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టినట్లవుతుందన్నారు.
బృహత్తరమైన పథకం అమలు చేస్తున్న క్రమంలో లోటుపాట్లు జరగడం సహజమని, వెంటనే వాటిని గుర్తించి సరిదిద్దుతూ లబ్ధిదారులకు పథకం ఫలాలు అందజేసే బాధ్యత అధికారులదేనన్నారు. దళితుల్లో ఆర్థిక పురోగతి ప్రారంభమైతే మొదటగా అధికారులనే వారిని గుర్తు చేసుకుంటారని చెప్పారు. అధికారులు చిత్తశుద్ధితో కొనసాగిస్తున్న ఈ పథకాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తించే స్థితికి చేరడం సంతోషకరమన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి విడిది గదితో పాటు, పలు వీఐపీల సూట్లు ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి తేనీటి విందు స్వీకరించారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులపై బల్దియా ఆధ్వర్యంలో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.