జగిత్యాల రూరల్/పెగడపల్లి, నవంబర్ 7 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో శ్రమించి సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో బ్యాచ్ శిక్షణను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో మొదటి బ్యాచ్లో శిక్షణ పొందిన 90మంది విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించారన్నారు.
రెండో బ్యాచ్ విద్యార్థులు ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలో 900 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. స్టడీ సర్కిళ్లకు సంబంధించి సీఎం తక్షణ నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారని కొనియాడారు. వేలకు వేల రూపాయలు చెల్లించలేని గ్రామీణ నిరుపేద విద్యార్థులకు స్టడీ సర్కిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం హైదరాబాద్లో మాత్రమే స్టడీ సర్కిల్ ఉండేదన్నారు. 23 జిల్లాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్లోని స్టడీ సర్కిల్లో సీట్లు పొందడానికి పోటీ పడాల్సి వచ్చేదన్నారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలకు 33 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశారని, ఒక్కో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టడీ సర్కిల్లో మంచి అనుభవమున్న అధ్యాపకులు, నాణ్యమైన భోజన సౌకర్యం, అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థులు గ్రూప్ 1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని పట్టుదలతో శ్రమిస్తే గ్రూప్ 2,3,4లో ఉద్యోగాలు సాధించడం సులభమవుతుందని పేర్కొన్నారు. గతంలో 1.32లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రస్తుతం 91వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని గుర్తుచేశారు. దేశంలోని 29రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉద్యోగాల కల్పన దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో జగిత్యాలలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. 1.35లక్షల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశారన్నారు. జిల్లా కేంద్రానికి బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేసిన మంత్రి గంగుల కమలాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా పేద, మధ్య తరగతి విద్యార్థుల ఎస్సీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ స్టడీ సర్కిల్ను సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి, ఎస్సీ స్టడీ సర్కిల్ స్టేట్ డైరెక్టర్ సీహెచ్ శ్రీధర్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ నరేశ్, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజ్ కుమార్, కౌన్సిలర్లు పద్మావతి, నాయకులు దుమాల రాజ్ కుమార్, ప్రశాంత్ రావు, ఆరుముళ్ల పవన్, జుంబర్తి శంకర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం పెగడపల్లి, బతికపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ, రైతులు పండించే పంటను పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు మూడు నుంచి పది రోజుల్లో ధాన్యం డబ్బులు కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోళి శోభ-సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, పెగడపల్లి, నంచర్ల విండో చైర్మన్లు వోరుగంటి రమణారావు, మంత్రి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ గంగాధర్, సర్పంచులు మేర్గు శ్రీనివాస్, టీ శోభారాణి, ఎంపీటీసీలు జమున-స్వామి, అనసూర్య, డీఆర్డీడీఏ ఏపీడీ సుధీర్, సెర్ప మండల ఏపీఎం సమత, సీఈఓ గోపాల్రెడ్డి, సీసీలు స్వామి, తిరుపతి తదితరులు ఉన్నారు.