జగిత్యాల అర్బన్/రూరల్, నవంబర్ 30 : జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 1.80కోట్లతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ను ప్రారంభించి, అనంతరం ధరూర్ క్యాంపులోని బసవేశ్వర విగ్రహం సమీపంలో 1.30కోట్లతో నిర్మిస్తున్న ఎస్టీ హాస్టల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ జీ రవి, మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రత్యేక చొ రవతో జగిత్యాలను జిల్లాగా మార్చి, అన్ని రకాల హంగులను కల్పిస్తున్నామన్నారు.
మెడికల్ కాలేజీతో పాటు, 300 పడకల ఎంసీహెచ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటుతో గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్, పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ముఖ్యమంత్రికి వివరించి మరింత నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన హాస్టల్తో ఎన్నో సంవత్సరాలుగా గిరిజనుల కల నెరవేరిందన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. హాస్టల్ భవనం అన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం 1.30కోట్లు మంజూరయ్యాయని, హాస్టల్ నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, జుంబర్తి రాజ్ కుమార్, లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి శ్రీధర్, గిరిజన అభివృద్ధి అధికారి ఎం గంగారాం, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.