‘అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని గడిచిన పదేళ్లలో చేసి చూపించాం. మారుమూల ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా తీర్చిదిద్దాం. గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందించాం. విద్య, వైద్యరంగాలను బలోపేతాం చేశాం. నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల దవాఖాన, డయాలసిస్ సెంటర్, 10 పడకలతో ఐసీయూను ఏర్పాటును చేశాం. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. రానున్న కాలంలో ధర్మపురిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇంతలా అభివృద్ధి చేస్తుండడం వల్లే ప్రజలు నాపై విశ్వాసం ఉంచుతున్నారు. ఇప్పటికీ ఆరు సార్లు గెలిపించారు. ఇప్పుడు కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉన్నది. ఏడో సారి కూడా విజయం నాదే’ అని ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– జగిత్యాల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ప్రజలు తనపై విశ్వాసం ఉంచి ఆరుసార్లు గెలిపించారని, ఇప్పుడు ఏడో సారి సైతం ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అరవై ఏండ్లలో చేయని అభివృద్ధిని ఈ పదేళ్లలో చేసి చూపామని స్పష్టం చేస్తున్నారు. మారుమూల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా తీర్చిదిద్దామని, ఇప్పుడు గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. రానున్న కాలంలో ధర్మపురి పట్టణాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన దివ్యక్షేత్రంగా మారుస్తామని, గోదావరి ముంపు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు ఏడోసారి పోటీ చేసే అవకాశం కల్పించిన అధినేత కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆరే నా ప్రచార తారక మంత్రమని, ఆయన తెచ్చిన పథకాలే తనకు శ్రీరామరక్ష అని, ఏడో సారి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, చేయబోయే పనులకు సంబంధించి వివరించారు. ఆయన మాటల్లోనే..
కొప్పుల : ఉద్యమకాలం నుంచి నేను కేసీఆర్ బాటలో నడుస్తున్నా. ఆది నుంచీ ఆయన నాపై నమ్మకం చూపుతూనే ఉన్నారు. 2004లో మొదటిసారి మేడారం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ధర్మపురి నుంచి చాన్స్ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్గా, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏడో సారి అవకాశం ఇచ్చారు. నాపై అపార విశ్వాసం ఉంచి, అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు, పార్టీ అధినాయకత్వానికి నా ధన్యవాదాలు.
కొప్పుల : 2009, 2010లో నేను ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచినా అది ఉద్యమ కాలం కావడంతో అప్పుడు ఎక్కువగా స్వరాష్ట్ర సాధనపైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చింది. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించినా, అప్పటి ప్రభుత్వాలు, పాలకులు పెద్దగా స్పందించలేదు. అరకొరగా నిధులు మంజూరు చేయడం వల్ల సంతృప్తికరంగా పనిచేయలేకపోయాం.నేను 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచా. స్వరాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధిపైనే ఫోకస్ చేశాం. ప్రజల మధ్యే ఉన్నాం. ప్రజా సమస్యలను తెలుసుకున్నాం. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్, సంక్షేమం రంగాలను ప్రాధాన్యంగా తీసుకొని పనిచేశాం. ప్రతి రంగంలోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించాం. దాంతో నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి.
కొప్పుల : ఒకప్పుడు నియోజకవర్గంలో కరెంట్ సరఫరా పెద్ద సమస్య. సబ్స్టేషన్లు లేవు. ట్రాన్స్ఫార్మర్లు లేవు. స్తంభాలు వంగిపోయి, కూలిపోయి ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసింది. సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నది. అందుకోసం దాదాపు ప్రతి ఊరికి సబ్స్టేషన్లు, వేలాది ట్రాన్స్ఫార్మర్లు వేసుకున్నాం. ఇక స్తంభాలకు లెక్కలేదు. ప్రస్తుతం దొంతాపూర్, ధర్మపురిలో సబ్స్టేషన్ల నిర్మాణాలు సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పూర్తవుతాయి.
కొప్పుల : నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అందుకోసం పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేశా. ధర్మపురిని ఆధ్యాత్మిక, ఆహ్లాదక ఆలయ పట్టణంగా మారుస్తా. ఆలయ పునర్నిర్మాణానికి ఇచ్చిన నిధులతో సుందరంగా తీర్చిదిద్దుతా. భారీ వర్షాలు కురిసి, గోదావరి పొంగిన ప్రతి సమయంలోనూ ధర్మపురి పట్టణంతోపాటు గోదావరి పరీవాహక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటా. గోదావరి పొంగితే ఎక్కడ ముంపు వస్తుందో ఇప్పటికే గుర్తించాం. ముంపు రాకుండా పరీవాహకంలో పెద్ద బండ్ నిర్మిస్తాం.
కొప్పుల : 2014కు ముందు ధర్మపురి నియోజకవర్గంలో 45వేల ఎకరాల్లోనే వరి సాగు అయ్యేది. నీటి వసతి తక్కువగా ఉండేది. నాణ్యమైన విద్యుత్ లేదు. పక్కనే గోదావరినది ఉన్నా పొలాలకు నీళ్లు వచ్చేమార్గం లేదు. బావులున్నా కరెంట్ లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయరంగం బలోపేతానికి టాప్ ప్రయార్టీ ఇచ్చాం. రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించాం. మొదట మిషన్ కాకతీయతో చెరువులు మరమ్మతులు చేశాం. బంధం మాటు లాంటి వాటిని బాగు చేసుకున్నాం. 135 కోట్లతో బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించాం. ధర్మపురి, వెల్గటూర్ మండలాల పరిధిలో 14కు పైగా ఎత్తిపోతల పథకాలను 256 కోట్లతో ఏర్పాటు చేశాం. గోదావరినదికి నీటిని తెచ్చే వాగులపై చెక్డ్యామ్లు నిర్మించాం. అలాగే ఎస్సారెస్పీ కాలువలను పొడిగించడంతోపాటు, నీటి వృథా కాకుండా చర్యలు చేపట్టాం. దీంతో సాగునీటి రంగం వృద్ధి చెందింది. ఇప్పుడు ఏకంగా 1.26 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. కొత్తగా 80వేల ఎకరాల ఆయకట్టును అదనంగా వినియోగంలోకి తీసుకువచ్చాం.
కొప్పుల : సీఎం కేసీఆర్ చల్లని చూపుతో ధర్మపురి సిరిపురి అయ్యింది. 2015 పుష్కరాలు ధర్మపురిలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో బ్రహ్మాండంగా సాగాయి. ధర్మపురి పట్టణం, టెంపుల్ సిటీ అభివృద్ధి కోసం బడ్జెట్లో 100 కోట్లు మంజూరు చేశారు. మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి 25 కోట్లు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ధర్మపురిని సందర్శించిన సందర్భంలో ప్రత్యేక నిధి కింద 10 కోట్లు ప్రకటించి మంజూరు చేశారు. వీటితోపాటు 6కోట్లు డీఎమ్ఎఫ్టీ నిధులు కేటాయించాం. మొత్తం 141కోట్లతో ధర్మపురి పట్టణంలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. త్వరలోనే పనులు పూర్తవుతాయి. దీంతో ధర్మపురి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. వీటితోపాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. మిషన్ భగీరథ కింద బోల్ చెరువు వద్ద 2 కోట్లతో ఫిల్టర్ బెడ్ నిర్మించాం. ధర్మపురికి ప్రతి రోజూ రక్షిత మంచినీరు సరాఫరా చేస్తున్నాం.
కొప్పుల : ధర్మపురి నియోజకవర్గంలో వైద్య సదుపాయం కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ధర్మపురి హెడ్క్వార్టర్లో దవాఖానను 50 పడకలకు పెంచాం. 100 పడకలకు పెంచేందుకు ప్రపోజల్స్ పంపించాం. డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయించాం. 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను ప్రారంభించాం. నియోజకవర్గ పరిధిలో 30 పల్లె దవాఖానలు, 2 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. మేడారంలో ఆరు పడకల దవాఖానను 30 పడకలుగా మార్చాం. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. కేసీఆర్ కిట్లు అందిస్తున్నాం. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాం. ఇక సీఎంఆర్ఎఫ్ ద్వారా వేలాది మందికి ప్రభుత్వ వైద్యం కోసం ఎల్వోసీలు ఇప్పించాం. అలాగే వైద్యం చేయించుకున్నవారికి ఆర్థిక సాయం అందించాం. 2.50 కోట్ల చొప్పున వ్యయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు నిర్మించాం. అవన్నీ కొత్త గురుకులాలే. ఇక గురుకుల డిగ్రీ కాలేజీని సైతం సాధించాం. గొల్లపల్లిలో జూనియర్ కాలేజీ నిర్మించాం. నియోజకవ ర్గంలో వేలాది మంది విద్యార్థులకు నేడు నాణ్యమైన విద్య అందిస్తున్నాం.
కొప్పుల : సీఎం కేసీఆరే నా ప్రచార తారక మంత్రం. ఆయన నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే నా ప్రచారాస్ర్తాలు. వృద్ధాప్య పింఛన్లు మొదలు కొని రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్ వరకు సీఎం కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు మరెవ్వరూ తేలేదు. సీఎం కేసీఆర్ మనోఫలకం నుంచి ఉద్భవించిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని నా నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ అందేలా చిత్తశుద్ధితో కృషి చేశా. పదేండ్ల కాలంలో నేను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నాకు, నా విజయానికి శ్రీరామరక్ష.