రైతాంగానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడడం దురదృష్టకరం. తెలంగాణ రైతాంగ సంక్షేమానికి, అభివృద్ధికి ఆయన మాటలు గొడ్డలిపెట్టు. 80 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా భ్రష్టుపట్టించింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో మరోసారి రైతు వ్యతిరేక విధానాలను ప్రకటించాడు. మనసులో ఉన్న మాటే బయటకు వస్తుంది. రైతులంటే కాంగ్రెస్, రేవంత్రెడ్డికి చిన్నచూపు. ఇది ఏ మాత్రం తగదు. ఆయన ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే.
-మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, జూలై 11(నమస్తే తెలంగాణ): రైతులకు 24 గంటల కరెంట్ వద్దంటూ అమెరికాలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ గడ్డపై ముక్కు భూమికి రాసి, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని స్టేట్ మినిస్టర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన, కొత్తపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై, కాంగ్రెస్ విధానాలపై, బీజేపీ రైతు వ్యతిరేక చర్యలపై మండిపడ్డారు. రైతాంగానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్రెడ్డి మాట్లాడటం దురదృష్టకరమని, తెలంగాణ రైతాంగ సంక్షేమానికి, అభివృద్ధికి ఆయన మాటలు గొడ్డలిపెట్టు అని ధ్వజమెత్తారు. 80 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే విషయంలో ఎలాంటి పాలసీ లేకుండా 50 ఏండ్లు పరిపాలన చేసి, రైతాంగాన్ని, సేద్యాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్, సకాలంలో అందుబాటులో ఎరువులను ఇప్పించలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో పోలీస్ స్టేషన్లలో ఎరువులు పెట్టి విక్రయించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండానే నీటి తీరువాను, పంటలు పండకున్నా, పంటశిస్తు వసూలు చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలు ఎక్కువగా ఏ రంగంపై ఆధారపడి ఉన్నారో ఆ రంగాన్ని సంస్కరిస్తే ఆర్థిక వృద్ధి జరుగుతుందని భావించి సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని సంస్కరించారని తెలిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు రైతులకు 24 గంటల పాటు విద్యుత్, సకాలంలో ఎరువులు, కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం, పీడీ యాక్టు ప్రయోగం, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టారని, ఫలితంగా రైతాంగం తిరిగి నిలదొక్కుకోవడంతోపాటు దేశంలోనే సేద్యంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుందన్నారు. తెలంగాణ ఒక వైపు అభివృద్ధిలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ దాన్ని చూసి తట్టుకోవడం లేదని మండిపడ్డారు. ఉచితాలు వద్దు అంటూ నిన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కారని, పెన్షన్ అవసరం లేదని వాగారని, ఇప్పుడు 24 గంటల కరెంట్ రైతుకు అవసరమా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడబం రైతులను పూర్తిగా వంచించడమేనని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో మరోసారి రైతు వ్యతిరేక విధానాలను ప్రకటించాడని మండిపడ్డారు. మనసులో ఉన్న మాటే భయటకు వస్తుందని, రైతులపై కాంగ్రెస్, రేవంత్రెడ్డి చిన్నచూపు. వ్యతిరేక భావంతో ఉన్నారన్నారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు శిష్యుడైన రేవంత్రెడ్డి ఆయన విధానాలనే అమలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే ప్రజలు ఉద్యమించారని, ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపిన చరిత్ర ఆయనదన్నారు. అలాంటి పద్ధతినే రేవంత్రెడ్డి అవలంభించాలని అనుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఒకవైపు రైతులను వంచిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే బాటలో ఉందన్నారు. రైతులకు మేలు చేసే విధంగా భూముల రికార్డుల కోసం ధరణి విజయవంతంగా అమలవుతుంటే ఆ వ్యవస్థను రద్దు చేసి, దానిని గంగలో పారేస్తానని ఇదివరకు రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఇప్పుడు మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారని ధ్వజమెత్తారు. రైతులంతా ఏకమై రైవంత్రెడ్డి వ్యాఖ్యలపై స్పందిచాలని కోరారు. బేషరతుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పేదాకా రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
రైతులను ముంచేందుకు బీజేపీ ప్రయత్నం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వడ్లు కొనుగోలు చేయమని, కల్లాలు తీసివేయాలని, రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని, మద్దతు ధర పెంచేది లేదంటూ రైతులను ముంచే ప్రయత్నం చేస్తుందన్నారు. కేవలం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తున్నదని, దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిందని, పారిశ్రామీకరణ గంగలో కలిసిందన్నారు. బీజేపీ పాలసీ ఇలా ఉంటే కాంగ్రెస్ ఇప్పుడు తన రైతు వ్యతిరేక విధానాలను బయటపెట్టుకుందని చెప్పారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే తెలంగాణ రైతుల వద్దకు వచ్చి 24 గంటల కరెంట్ అవసరమా? లేదా? అడగాలని సవాల్ విసిరారు. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. జాతీయ నాయకుడినని చెప్పుకునే రాహుల్గాంధీ, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం అసంబద్ధంగా ఉందన్నారు. రూ.లక్ష కోట్ల వ్యయం అయిన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి అబద్దాలనైనా ప్రచారం చేస్తుందని, ఎలాంటి గడ్డినైనా తిట్టుందన్నారు. రైతులను వంచించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జడ్పీటీసీ సభ్యుడు నాగం భూమయ్య తదితరులు పాల్గొన్నారు.