జూలపల్లి, సెప్టెంబర్ 25: రెండో విడత కొత్త పింఛన్లు రాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ అందజేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో రెండు లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రెండు కిడ్నీలు పని చేయని వారిని గుర్తించి పింఛన్ ఇ చ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం జూలపల్లి మండలం అబ్బాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్ ఈర్ల మల్లేశం అధ్యక్షతన మహిళలకు బతుకమ్మ చీరెలు, అలాగే 102 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
రెడ్డి, ముదిరాజ్ సామాజిక భవన నిర్మాణ పనులకూ భూమి పూజ చేశారు. అనంతరం మం త్రి మాట్లాడారు. తెలంగాణ అంటేనే బీజేపీ కండ్లు మండించుకుంటున్నదని, అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక బట్టకాల్చి మీదేసేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆ పార్టీ ఎనిమిదేండ్ల పాలనలో ఏం చేసిందో చెప్పాలని, ధరలు, పన్నుల భారం మోపుతూ, ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ దేశాన్ని భ్రష్టుపట్టిందని దుయ్యబట్టారు. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’.. అని చెబుతూ మభ్య పెడుతున్ననని, బీజేపీ పాలిత 18 రాష్ర్టాల్లో ప్రజా సంక్షేమాన్ని ఎన్నడో గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఆయా రాష్ర్టాల్లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని,కానీ స్వరాష్ట్రంలో రూ.200 నుంచి రూ.2016 కు, దివ్యాంగులకు రూ.3016కు పెంచుకుని ఇస్తున్నామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంత పెద్ద మొత్తంలో ‘ఆసరా’ కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనని ఉద్ఘాటించారు. గతంలో కరెంట్ కోతలు, సాగు నీరు లేక తల్లడిల్లిన తెలంగాణ ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో తలెత్తుకుని ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. బీజేపీ పాలనలో పెట్రోలు, గ్యాస్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ 40 ఏండ్ల పాలనలో దేశం, రాష్ట్రం తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు.
బండి సంజయ్ తొండి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. కాగా, గ్రామంలో సిమెంట్ రోడ్లు, బస్ షెల్టర్, స్వశక్తి మహిళ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ మల్లేశం మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మహిళా భవన్కు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా పనులు సత్వరమే నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ పాలక వర్గ సభ్యులు మంత్రికి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ కంది చొక్కరెడ్డి, సర్పంచులు దారబోయిన నరసింహం, బంటు ఎల్లయ్య, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్రావు, తాసిల్దార్ అబుబాకర్, ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఎంపీవో కిరణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య ఉన్నారు.