ధర్మారం, మార్చి16: అనారోగ్యానికి గురైన ఓ బాలుడికి మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు. మెరుగైన చికిత్స కోసం ఎల్వోసీ మంజూరు చేయించి పెద్ద మనసును చాటుకున్నారు. ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన వేల్పుల మల్లేశం- అనిత దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. కొడుకు శ్రీషాన్ తేజ (4)కు ఈ నెల 2న జ్వరం వచ్చి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించారు.
వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఈ నెల 3న ఆ బాలుడిని హైదరాబాద్కు తీసుకెళ్లారు. నిమ్స్ దవాఖానలో చేర్పించగా రక్త కణాలు బాగా తగ్గిపోయాయని, తక్షణ చికిత్సకు 5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు బాలుడి తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఈ నెల 10న మంత్రి ఈశ్వర్ను ఆశ్రయించారు. బాలుడి తండ్రి హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్లో మంత్రిని కలిసి కొడుకు పరిస్థితి వివరించాడు. తక్షణమే స్పందించిన అమాత్యుడు 2.50లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఎల్వోసీ పత్రాన్ని హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్లో గురువారం బాలుడి తండ్రి మల్లేశంకు మంత్రి ఈశ్వర్ అందజేశారు. ఆపదలో ఆపన్నహస్తం అందించిన మంత్రికి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.