ధర్మపురి, నవంబర్ 16: ‘అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే, ప్రగతివైపు నిలిచే బీఆర్ఎస్ పాలన కావాలా..? అయ్యా.. అప్పా అంటూ ఢిల్లీ పెద్దలకు గులాంగిరీ చేసే వారి పాలన కావాలో.. ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరించారు. ధర్మపురి మండలం పెద్దనక్కలపేట, బోదరినక్కలచెరువు గూడెం, దుబ్బలగూడెం, దోనూర్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రికి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికి తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, ఆయా గ్రామాల్లో వీధివీధినా పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడారు. కటక వేస్తే తలుక్కున వచ్చే కరెంటు కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో.. ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీల కట్టు కథలు నమ్మవద్దని, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలని మంత్రి ఈశ్వర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు అధినేత మొదటి నుంచి కేసీఆరేనని, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏడాదికోసారి మారే సీఎంలు ఉన్నారని చెప్పారు. అయిదేళ్ల పాలనలో ఐదురుగు సీఎంలు పరిపాలించిన దాఖలాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో సుస్థిరపాలన అందించే సీఎం కేసీఆర్కే మారుమారు జైకొట్టాలని కోరారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రూ.600 పింఛన్ ఇస్తున్నారనీ, కల్యాణ లక్ష్మి లాంటి పథకం కూడా అమలు చేయడంలేదన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నదని, మరోసారి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతుబంధు కింద రైతులకు ఎకరాకు రూ.16వేలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఆసరా పింఛన్ను రూ.5వేలకు పెంచుతామని ప్రకటించారు. జనవరి నుంచి అసైన్డ్ భూములకు పట్టాలివ్వబోతున్నామన్నారు. రాష్ర్టాన్ని, నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని, ప్రజలు సైతం మారోమారు కారుగుర్తుకే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలన్న గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి ఈశ్వర్ కొనియాడారు. రాష్ట్రంలో 3 వేల తండాలను జీపీలుగా మార్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో తండాలను గిరిజనులే అభివృద్ధే చేసుకుంటున్నారన్నారు. గిరిజన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో ఉన్నత చదువులు చదువుతున్నారని పేర్కొన్నారు. ధర్మపురి మండలం ఆక్సాయిపల్లిలో గిరిజనులకు వందశాతం పట్టాలు ఇప్పించామన్నారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మండల ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్ ఉన్నారు.