వెల్గటూర్, ఏప్రిల్ 1: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇండ్లు, భూములు కోల్పోయి నిరాశ్రయులైన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీనిచ్చింది. సచివాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ను గ్రామానికి చెందిన బాధితులు సోమవారం కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామంలో ముంపునకు గురైన 135 ఇండ్లకు పరిహారం చెల్లిస్తున్నట్టు 2009 సంవత్సరంలోనే ప్రకటించారని, భూమి హకు పట్టాలు ఇచ్చినా ఇండ్ల నిర్మా ణానికి నిధులు రాలేదని వాపోయారు. నాటి నుంచి అధికారులు సర్వేల పేరుతో కాలయా పన చేశారు తప్ప న్యాయం చేయలేదని వా పోయారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ గతంలో పైరవీకార్ల మాటలను గ్రామస్తులు నమ్మడంతోనే ఇంత జాప్యం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని, చెగ్యాం బాధితుల సమస్య పరిషారానికి కూడా చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులను స్వయంగా సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వద్దకు మంత్రి కొప్పుల తీసుకెళ్లారు. నిర్వాసితుల ఆవేదనను వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన రజత్కుమార్ వారం, పది రోజుల్లో విచారణ జరిపిస్తామని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెగ్యాం గ్రామస్తులు మంత్రి కొప్పుల ఈశ్వర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.