జగిత్యాల, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 26 : స్వరాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలకు సీఎం కేసీఆర్ చేసినంత మేలు స్వతంత్రం వచ్చిన డబ్బు ఏండ్లలో ఎవరూ చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం అని చెప్పారు. అకాల వర్షం, వడగండ్లతో నష్టపోయిన ఏ ఒక్క రైతూ బాధపడొద్దని, మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉన్నదని భరోసానిచ్చారు. జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వీకేబీ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మూడు తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశానికే స్ఫూర్తి నింపేలా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమంటూ వెల్గటూర్ జడ్పీటీసీ సుధారాణి తీర్మానాన్ని ప్రతిపాదించగా, మరో జడ్పీటీసీ సభ్యుడు మహేశ్ తీర్మానాన్ని బలపర్చారు.
దీంతో సభ్యులు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ జడ్పీటీసీ సుధారాణి మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎంపీపీలు చిట్టిబాబు, స్వర్ణలత బలపర్చడంతో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో దేశ రాజధానిలో మహిళ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరుతూ ఉద్యమించిన విషయాన్ని జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి ప్రస్తావిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించగా, జడ్పీటీసీ జాదవ్ అశ్విని బలపర్చారు. దాంతో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ రెండు తీర్మానాలను ప్రధానికి పంపించాలని కోరుతూ అదనపు కలెక్టర్ మకరంద్కు ప్రతులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమన్నారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.