జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 5 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల నిర్వహణపై శుక్రవారం జగిత్యాల జిల్లా అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 8 నుంచి 20 వరకు దేశభక్తి పెంపొందేలా వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ఉత్సవాలను ఘనంగా జరపాలని సూచించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేసేలా చూడాలని, ఆ మేరకు జాతీయ పతాకాలు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని, విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
ధర్మపురిలో స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి కేవీ కేశవులు అని, గంగాతీరంలో కూడా స్వాతంత్య్ర సమరయోధుడు జగిత్యాల జిల్లాలో ఉండడం విశేషమని, ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా గొప్పదనాన్ని భావితరాలకు చేరవేయాలని మంత్రి తెలిపారు. కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ, వజ్రోత్సవాల సందర్భంగా ఒకోరోజు ఒకో యాక్టివిటి ఉండేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఐదు మున్సిపాలిటీల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని, 5వ తరగతి నుంచి 10 వ తరగతి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించాలని అధికారులకు సూచించారు. జాతీయ జెండాను ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, అరుణ శ్రీ, మున్సిపల్ చైర్మన్లు బోగ శ్రావణి, సంగి సత్తమ్మ, జడ్పీ చైర్పర్సన్ వసంత, డీఎస్పీ ప్రకాశ్, డీఆర్డీవో నరేశ్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.