కరీంనగర్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కల సాకారమైంది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోయాయి. కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ శివారులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 67 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో 56 ఇండ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించగా, అమాత్యుడు దగ్గరుండి గృహప్రవేశాలు చేయించారు. అన్ని వసతులతో ముస్తాబైన కాలనీలో లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని తమ కొత్త ఇండ్లలోకి వెళ్లారు. కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తపల్లి మండలం కమాన్పూర్ శివారులో నిరుపేద ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఆదివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి గృహ ప్రవేశం చేయించారు. కమాన్పూర్ శివారులోని రాములపల్లె ముంపు బాధితుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ కాలనీలో 67 డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయి. వీటిలో రాములపల్లెకి చెందిన 36 కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల సమక్షంలో మంత్రి గంగుల లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించారు. అనంతరం ఈ కాలనీలో ఏర్పాటు చేసిన శిలాఫకాన్ని ఆవిష్కరించారు. ముగ్గురు లబ్ధిదారులను దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలు పట్టుకొని కొత్త ఇళ్లలోకి వెళ్లారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం కేసీఆరే తమ దేవుడని, ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చినందుకు ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని స్పష్టం చేశారు.
నిరుపేదల కల సాకారం
డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూం ఇండ్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు కేటాయించి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోనే కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఇండ్లకు విద్యుత్ మీటర్లు, తాగునీటి సరఫరా కల్పించామన్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దైవంతో సమానమని, కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కమాన్పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్ఎండీ ముంపునకు దగ్గరగా ఉన్నాయని, వారికి రిహబిలిటేషన్ కింద ఇండ్లు కేటాయించామని మంత్రి తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు ఆదివారం డబుల్ బెడ్ ఇండ్లు కేటాయించామని, మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అధికారులు అర్హులైన వారికి కేటాయిస్తారని ఆయన తెలిపారు. మిగిలిన బెడ్ రూం ఇండ్లను కమాన్పూర్ గ్రామస్తులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ ఆదివారం కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గృహ ప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు.
రాములపల్లి గ్రామస్తులు వారి ఇండ్లను వెంటనే ఖాళీచేసి కొత్తగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి మారాలని ఆయన కోరారు. ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులు ఎవరికి అమ్ముకోరాదని, ఇతరులకు కిరాయికి ఇవ్వరాదని, ఇది చట్టరీత్యా నేరమని, లబ్ధిదారులు మాత్రమే సొంత డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించాలని ఆయన కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్లు రానివారు అధైర్యపడవద్దని, అర్హులైన వారికి కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్తో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్లు సీరియల్ నంబర్ 7, 8, 9, 10, 11 గృహాల్లో లబ్ధిదారులతో కలిసి ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, ఆర్డీవో ఆనంద్కుమార్, ఎలక్ట్రిసిటీ డీఈ రాజిరెడ్డి, ఏడీఈ రాజు, ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్, సర్పంచ్ జినుక సంపత్, మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, తహసీల్దార్ శ్రీనివాస్, చింతకుంట ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్, సోమినేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం..
మాకు రాములపల్లికాడ భూమి ఉంటే ఇంత డ్యాంల మునిగిపోయింది. ఇంకొంచెం భూమి ఉంటే సాగు చేసుకొని బతుకుతున్నం. కానీ ఇండ్లళ్లనే ఉండలేక పోతున్నం. గతంల వర్షాకాలం వచ్చిందంటే ఇండ్లళ్లకే డ్యాం నీళ్లచ్చేటియి. ఇపుడు ఎప్పుడు నీళ్లే ఉంటున్నయ్. ఇగ ఆడ ఉండుడు మంచిదిగాదు. మంత్రి గంగుల కమలాకర్ సార్కు మా బాధలు చెప్పుకోంగనే కొత్త ఇండ్లు కట్టిచ్చి ఇచ్చిండు. చాన సంతోషంగ ఉన్నది. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు. పాత ఇండ్లు వదిలేసి కొత్త ఇంట్లకు వస్తం. అక్కడ పాములు, తేల్లు విపరీతంగా ఉంటున్నాయి.. – నునుగొండ రాధ, శ్రీనివాస్ దంపతులు..
మా బాధలు అర్థం చేసుకుని ఇల్లిచ్చిండ్రు..
కొత్త ఇల్లు వచ్చినందుకు మాకెంతో సంతోషంగుంది. కూలీనాలీ చేసుకుని బతికెటోళ్లం. ఇంత పెద్ద ఇల్లు ఎట్ల కట్టుకుంటం. రాములపల్లెకాడ మా ఇండ్ల చుట్టూ నీళ్లస్తన్నయన్నని మంత్రి గంగుల కమలాకర్కు చెప్పుకుంటే మా బాధలు మంచిగ అర్ధం చేస్కొని ఇక్కడ పెద్ద కాలనీ కట్టిచ్చిండు. ఆయిన రుణం తీర్చుకోలేం. మాకు ఇల్లు ఇచ్చిన కేసీఆర్ సార్కు సుతం ధన్యవాదాలు. మాకు కొత్త ఇల్లు వచ్చినందుకు చాన చాన సంతోషంగున్నది..
కేసీఆర్ సారే పెద్ద దిక్కయ్యిండు
నా భర్త శ్రీనివాస్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు. అప్పటి సంది ఇద్దరు పిలగాండ్లను వట్టుకొని సంసారం ఎల్లదీస్తన్న. నా రెక్కల కష్టమంతా పిల్లల కోసమే ఖర్చయితంది. సొంతంగా ఇంత ఇల్లుగట్టుకునే స్థోమత లేకుంట అయింది. ఇండ్ల చుట్టూ నీళ్లు పాములు, కప్పలు, తేళ్లు వస్తే పిల్లలు మస్తు భయపడుతున్నరు. అక్కడ ఉండ లేమని గంగుల సారుకు చెప్పినం. ఆయనే వచ్చి ఓసారి మా బాధలు చూసిండు. ఇండ్లు కట్టిచ్చి ఇస్తనన్నడు ఇచ్చిండు. మాకు శానా సంతోషగున్నది. కట్టిన ఇంట్ల కచ్చి ఉండుడే మా పని. కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
కొత్తపల్లి మండలం కమాన్పూర్ శివారులోని రాములపల్లె సుమారు 40 ఏండ్ల కింద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్ఎండీ జలాశయంలో ముంపునకు గురైంది. ఇక్కడి రైతుల భూములకు నష్ట పరిహారం చెల్లించిన అప్పటి ప్రభుత్వం ఇండ్లు, ఇంటి స్థలాల గురించి పట్టించుకోలేదు. ఎల్ఎండీలో నీటి మట్టం పెరిగినపుడల్లా ఇక్కడి ఇండ్ల చుట్టూ నీళ్లు రావడం, విష కీటకాలు ఇండ్లలోకి చేరి భయబ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తమ గోడును మంత్రి గంగుల కమలాకర్కు విన్నవించుకోగా, ఆయన వెంటనే స్పందించి వీరికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు. ఈ మేరకు గ్రామానికి కూత వేటు దూరంలో 67 డబుల్ బెడ్రూం ఇండ్లను అద్భుతంగా నిర్మించి ఆదివారం లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో కేటాయించారు. దీంతో రాములపల్లె గ్రామస్తులు సుమారు 40 ఏండ్ల నుంచి పడుతున్న గోస తీరినట్లయింది.