కలెక్టరేట్, జనవరి 5 : రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్యకు అశ్రు నివాళులర్పించారు. బుధవా రం సాయంత్రం గుండెపోటుతో ఆయన మరణించగా, గురువారం మధ్యాహ్నం కరీంనగర్ మార్కండేయనగర్లోని స్వర్గధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం 9గంటలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్తోపాటు పలువురు నాయకులు మంత్రి గంగుల నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. కొద్దిసేపు అక్కడ గంభీరవాతావరణం నెలకొనగా, మంత్రి హరీశ్, వినోద్కుమార్ గంగులతోపాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, ఎల్ రమణ, కూర రఘోత్తంరెడ్డి, పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, జడ్పీ అధ్యక్షులు పుట్ట మధు, కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, డా సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్ నివాళులర్పించారు. వీరంతా అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు.