వేములవాడ, జూలై 31: ‘కీపిటప్.. బాగా పనిచేస్తున్నారు..పేద ప్రజలకు మీ సేవలు ఇలాగే అందించాలి’ అని వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వేములవాడ ఏరియా దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు తన వైద్య బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. దవాఖానలో ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం సూపరింటెండెంట్ మహేశ్ రావును శాలువాతో సత్కరించారు. కాగా, మంత్రికి వైద్యులు రాజన్న చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఇక్కడ వైద్యులు తిరుపతి, అనిల్ కుమార్, సంతోష్చారి ఉన్నారు.