కరీంనగర్ రూరల్, నవంబర్ 2: స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, నాటి పల్లెల కంటే నేటి పల్లెలు అభివృద్ధి బాటలో సాగుతున్నాయని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సతీమణి గంగుల రజిత అన్నారు. మండలంలోని దుర్శేడ్ గ్రామంలోని అభివృద్ధిని చూసి గంగులను గెలిపించాలని కోరారు. గురువారం కరీంనగర్ మండలంలోని దుర్శేడ్ గ్రామంలో రాష్ట్ర మంత్రి గంగుల సతీమణి రజిత ఒక వైపు, గంగుల సుధాకర్ తన సతీమణితో కలిసి మరోవైపు ప్రచారం చేశారు. మహిళలతో కలిసి ఇంటింటికీ ప్రచారం చేశారు. ఆసరా పింఛన్లు అందుతున్నాయా..? రైతుబంధు వస్తుందా..? అంటూ వృద్ధులను, రైతులను ఆప్యాయంగా పలుకరించారు.
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్ను 3 వేల నుంచి 5 వేల వరకు పెంచుతారని వారికి అవగాహన కల్పించారు. మహిళలకు, ఆడపడుచులకు కుంకుమపెట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గంగుల రజిత మాట్లాడారు. రాష్ట్రం వచ్చిన తరువాత గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సమైక్య పాలనలోని గ్రామ పరిస్థితిని, ప్రస్తుతం అభివృద్ధి చెందిన విశాలమైన రోడ్లు చూడాలని, గ్రామంలోని సీసీ రోడ్లతో వీధులు ఎంత అందంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. గంగుల కమలాకర్ను మరో సారి గెలిపించాలని ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కల్యాణలక్ష్మి, రైతుబంధును ఇంటింటికీ అందిస్తున్నారని వివరించారు.
గ్రామాల్లో గల్లీగల్లీకి సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేశారని గుర్తు చేశారు. గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే గంగుల కమలాకర్ను గెలిపించాలని, కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. కేసీఆర్ లేని తెలంగాణ గుడ్డిదీపం అవుతుందన్నారు. మీ బిడ్డగా మూడుసార్లు గెలిపించారని, మరోసారి ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటు వేసి గంగుల కమలాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మా ఓటు గంగుల కమలాకర్కే అంటూ గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున్న గంగుల రజితకు. గంగుల సుధాకర్కు మద్దతు తెలిపారు. ప్రచారంలో రజితకు తోడుగా పలువురు గ్రామస్తులు వచ్చారు.
ప్రచారంలో సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, దాది సుధాకర్, మాజీ సర్పంచ్ తోట లక్ష్మి, సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతి, గాజుల అంజయ్య, గంగుల సుధాకర్, కుటుంబసభ్యులు అంబిక, ఎంపీటీసీ గోల్లి రాజ్యలక్ష్మి, సంతోష, సుజాత, అనిత కుమారి, వేణుమాధవరావు, యూత్ మండలాధ్యక్షుడు నెరెళ్ల శ్రీనివాస్, అంజయ్య, రాజ్కమల్, గౌడ నర్సయ్య, కుమార్, భూతం రవీందర్, పురుషోత్తం, శ్రీరామోజ్ తిరుపతి, రమేశ్, బోగ తిరుపతి, మధు, మహేశ్, శ్రీనివాస్, సతీశ్, నారాయణ, పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.