కరీంనగర్ టూ సిరిసిల్ల ప్రధాన రహదారి జిగేల్ మంటున్నది. పద్మనగర్ నుంచి ఒద్యారం దాకా 17 కిలోమీటర్ల పొడవునా రాత్రివేళ కాంతులీనుతున్నది. 5.70 కోట్ల సుడా నిధులతో 456 కరెంట్ స్తంభాలకు 912 ఎల్ఈడీలు ఏర్పాటు చేయగా, మంత్రి గంగుల కమలాకర్ బుధవారం రాత్రి సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఇక్కడ స్థిరపడ్డ తమిళకాలనీ వాసులకు పథకాలు అందేలా కృషిచేస్తానని హామీనిచ్చారు.
కొత్తపల్లి, మార్చి 29: అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఇక్కడ స్థిరపడ్డ తమిళకాలనీ ప్రజలకు పథకాలు అందేలా కృషిచేస్తానని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని పద్మనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదారిలో గంగాధర మండలం ఒద్యారం (17 కిలోమీటర్లు) దాకా 5.70 కోట్లతో పూర్తి చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను బుధవారం రాత్రి ప్రారంభించారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 5.70 కోట్లతో 456 కరెంట్ పోల్స్కు బిగించిన 912 ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్ పనులను స్విచ్ఛాన్ చేసి వెలుగులు నింపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ నుంచి వేములవాడ, సిరిసిల్ల నగరాలకు సాయంత్రం వేళ సురక్షితంగా ప్రయాణించేందుకు సెంట్రల్ లైటింగ్తో దోహదం చేస్తుందన్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల కార్మికులకు ఉపాధి కేంద్రంగా మారిన గ్రానైట్ పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో రవాణా వ్యవస్థకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్గౌడ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, సుడా డైరెక్టర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.
అంతకు ముందు కరీంనగర్- ఒద్యారం దాకా చేపట్టిన నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా చింతకుంట వద్ద బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం ఆసిఫ్నగర్ తమిళ కాలనీలోని మరియమ్మ మాత టెంపుల్కు వెళ్లారు. తమిళనాడు నుంచి కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డవారికి ప్రభుత్వం పథకాలన్నీ అమలయ్యే చూస్తామని హామీ ఇచ్చారు. కమాన్పూర్ ఒడ్డెరకాలనీ భవనానికి 5 లక్షలు, ఆసిఫ్నగర్లో కమ్యూనిటీ భవనానికి 10 లక్షల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.