విద్యానగర్, మార్చి 4: రాష్ట్రంలో అతి చిన్న వయస్సువారు గుండెపోటుతో మరణిస్తున్న తరుణంలో అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి కళాశాలలో నిర్బంధ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఐఎంఏ అసోసియేషన్, ఫార్మసీ అసోసియేషన్, వైద్యాధికారులు, కార్టియాలజిస్టులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్ను ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేలా ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులకు నిర్బంధ గుండె సంబంధిత ఈసీజీ, రక్త, మొదలైన వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందిస్తామన్నారు.
ఈ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, ఐఎంఏ, డయోగ్నోస్టిక్ నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. వైద్య పరీక్షల నిర్వహణకు కావాలసిన సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో పోలీస్, మున్సిపల్ సిబ్బందికి సీపీఆర్ ద్వారా సహాహం ఎలా అందించాలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రైవేట్ దవాఖానల వైద్యులు ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, మేయర్ వై సునీల్రావు, అడిషన్ కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అధికారులు, డాక్టర్లు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు.