కరీంనగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు కరీంనగర్ నియోజకవర్గాన్ని ముఖ్యంగా నగరాన్ని ఏ పాలకులు పట్టించుకోలేదని వాపోయారు. యాభై ఏళ్లుగా జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చిన కొన్నేళ్లలోనే చేసి చూపించామన్నారు. కరీంనగర్ రూపు రేఖలు మార్చాలని ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారని, అదే తలంపుతో తామంతా ప్రజల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
గ్రామీణ రోడ్లకు మరో రూ.16.10 కోట్లు
కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లో ఇప్పటికే ప్రధాన, అంతర్గత రోడ్లను పూర్తి చేశామన్నారు. రెండు మండలాలకు సంబంధించి ఇంకా అక్కడక్కడా మిగిలిపోయిన రోడ్ల కోసం జీవో నంబర్ 382 ద్వారా మరో రూ.16.10 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఖాజీపూర్కు రూ.4.50 కోట్లు, గోపాల్పూర్కు రూ.1.50 కోట్లు, బొమ్మకల్కు రూ.5.50కోట్లు, ముగ్ధుంపూర్కు రూ.కోటి, నాగులమల్యాలకు రూ.2 కోట్లు, చింతకుంటకు రూ.కోటి, మల్కాపూర్కు రూ. 60 లక్షల చొప్పున మొత్తం 22.50 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. చెర్లభూత్కూర్, ఫకీర్పేట రోడ్లకు నిధులు మంజూరయ్యాయని, ఈ పనులు కూడా సెప్టెంబర్లో ప్రారంభించి అక్టోబర్ చివరి వరకు పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్ సిటీలో రూ. 132 కోట్లతో చేపట్టే రోడ్డు పనులకు సోమవారం టెండర్లు ఫైనల్ అవుతున్నాయన్నారు. స్మార్ట్ సిటీ తదితర పథకాల కింద మిగిలిపోయిన రోడ్లకు రూ. 125 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 18న అన్నీ రోడ్ల పనులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
వీకెండ్ స్పాట్గా కేబుల్ బ్రిడ్జిని తీర్చిదిద్దుతున్నాం
మానేరు రివర్ ఫ్రంట్ ద్వారా అద్భుతమైన టూరిస్ట్ స్పాట్గా కరీంనగర్ను తీర్చి దిద్దుతున్నామని మంత్రి గంగుల అన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారన్నారు. ఇప్పటికే మానేరు రివర్ ఫ్రంట్కు గేట్లు బిగించాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా పనులను వాయిదా వేశామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ గేట్లు బిగించి మానేరు రివర్ ఫ్రంట్లో బోటింగ్ ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. ఫౌంటేన్ ఏర్పాట్లకు కూడా ఫిట్స్ తీసే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు మానేరు అందాలతో పాటు కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ను ఆస్వాదిస్తుండడంతో ప్రతీ రోజు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిందని, దీంతో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోందన్నారు. దీంతో ప్రతీ శని, ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జిపై భారీ వాహనాలైన లారీలు, బస్సులు, కార్లకు అనుమతి ఇవ్వమని, సాయంత్రం 6 గంటల నుంచి ప్రజల సందర్శన కోసం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ నిబంధనలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమా లుంటాయని, భారీ ఎత్తున క్రాకర్స్ ప్రదర్శిస్తామని, ఈట్ ఫుడ్ పేరుతో అనేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీసీలకు రెండు నెలలది ఒకేసారి పంపిణీ
దళితబంధు కింద లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నదని, నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించామని తెలిపారు. బీసీ కులవృత్తులకు సంబంధించి ప్రతీ నియోజకవర్గంలో 300 మందికి రూ. లక్ష చొప్పున ప్రతీ నెల నిరంతరాయంగా కొనసాగుతుందని, కరీంనగర్ నియోజకవర్గంలో బీసీ కుల వృత్తులకు రెండు నెలలకు కలిపి ఒకే సారి చెక్కులను అందజేశామన్నారు. మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని ఈ నెల 16న ప్రారంభిస్తామన్నారు. మైనార్టీలకు కుట్టు మిషన్ల పథకాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. గృహలక్ష్మి పథకం కూడా నిరంతరాయంగా కొనసాగుతుందని, ఈ పథకానికి చివరి తేదీ అంటూ ఏదీ లేదని, ఈ పథకానికి ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని మంత్రి కోరారు.
ఆరోపణలు నిరూపించకుంటే కేసులు పెడత
ఎన్నికలు రాగానే కొందరు దొంగ నాయకులు పుట్టుకొస్తారని, వాళ్లను ప్రజలు నమ్మొద్దని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. తాను వక్ఫ్బోర్డు భూములు ఆక్రమించినట్లు ఎన్నికలు రాగానే కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని, వీరి తీరు మార్చుకోకుంటే కోర్టులో పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తాను కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో ఫాంహౌస్ కోసం భూమిని కొనుగోలు చేశానని, అందులో వక్ఫ్ భూములున్నాయని కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆరోపణలు ఇప్పటి వరకు నిరూపించలేక పోయారని పేర్కొన్నారు. నేను ఆక్రమించినట్లు నిరూపించాలని, లేదంటే వారిపై పరువు నష్టం దావా వేస్తానని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సమావేశంలో మేయర్ వై.సునీల్ రావు, బీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కరీంనగర్, కొత్తపల్లి ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కేబుల్ బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ
కరీంనగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలతో కరీంనగర్ గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించనున్న వీకెండ్ మస్తీ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి వేదికగా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీకెండ్ మస్తీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, స్ట్రీట్ ఫుడ్, క్రాకర్ షోలతో పాటు పిల్లలను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలకు ప్లే గేమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ పిల్లలతో పెద్ద ఎత్తున రావాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను కోరారు.
కరీంనగర్ జిల్లాను అన్ని రంగాలతో పాటు 24 టీఎంసీల వాటర్ బాడీని కలిగి ఉన్న మానేరు నది ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తామన్నారు. ఇక నుంచి ప్రతీ శని, ఆదివారం కేబుల్ బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ కొనసాగుతుందని, ఆ రెండు రోజులు సాయంత్రం 6 గంటల నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా వాహనాలు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని, మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఇప్పటికే 25 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో ఇప్పటికే అద్భుతమైన రోడ్లు, ఐలాండ్ల నిర్మాణం పూర్తయ్యిందని, రివర్ ఫ్రంట్ పూర్తయితే జిల్లా ప్రజలకు కరీంనగర్ గొప్ప ఆస్తిగా నిలుస్తుందని మంత్రి గంగుల వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి వీకెండ్ మస్తీ పోస్టర్ను ఆవిష్కరించారు. సమీక్షా సమావేశంలో మేయర్ వై. సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ ఆర్డీవో వీ మహేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జడ్పీటీసీ, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.