కమాన్చౌరస్తా, ఆగస్టు 20: టూరిజం హబ్గా కరీంనగర్ మారుతున్నదని, రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తం జిల్లా వైపు చూడనున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తీగల వంతెన సమీపంలో ‘వీకెండ్ మస్తీ’ కార్యక్రమాన్ని మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఆరు నెలల్లో మొదటి దశ రివర్ఫ్రంట్ పనులు పూర్తిచేస్తామని చెప్పారు. వీకెండ్ మస్తీ ప్రతి ఆదివారం ఉంటుందని, వానకాలం పూర్తయిన తర్వాత ప్రతి శనివారం, ఆదివారం కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్క రూ కుటుంబసభ్యులతో వచ్చి కార్యక్రమాలు ఆస్వాదించాలని, ఇక్కడ అందరి కోసం ఫుడ్ స్టాల్స్, చిన్నారుల కోసం గేమ్ జోన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో యాంకర్ సిరి వ్యాఖ్యానం ఆకట్టుకోగా, బాలభవన్ చిన్నారుల నృత్యం, హైదరాబాద్ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాండ్ ఆర్ట్ కళాకారుడు కాంత్ రిసా వేసిన చిత్రం ఎంతో ఆకట్టుకుంది.
తీగల వంతెనపై వినోద్కుమార్ సందడి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కేబుల్ బ్రిడ్జిపై సందడి చేశారు. సాయంత్రం తీగల వంతెనపైకి వచ్చి, సందర్శకులు, యువకులతో ముచ్చటించారు. వంతెన ఎలా ఉంది..? నగరంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి.. అని అడిగి తెలుసుకున్నారు. యువకులు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.
ఆనందంగా ఉంది..
వీకెండ్ మస్తీలో కళాకారుల నృత్యం ఎంతో ఆకట్టుకుంటోంది. జిల్లాకు చెందిన బాలభవన్ చిన్నారులతో పాటు, హైదరాబాద్ కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే చూశాం. కానీ ఇప్పుడు మనకు అందుబాటులో రావడం చాలా సంతోషంగా ఉంది.
– సుమలత, కరీంనగర్
ప్రజల ఆదరణ బాగుంది..
నేను దేశవ్యాప్తంగా కవ్వాలీ ప్రదర్శనలు ఇస్తుంటా. కానీ కరీంనగర్ ప్రజల నుంచి ఆదరణ చాలా బాగుంది. కేబుల్ బ్రిడ్జి ప్రారంభ సమయంలో కార్యక్రమం నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చిన. ఆ సమయంలో ఇక్కడి ప్రజలు నా ప్రదర్శనను చాలా బాగా ఆస్వాదించారు. అందుకే మరోసారి అవకాశం రాగానే వచ్చేశాం.
– ఘులాం వారిష్, కవ్వాలీ కళాకారులు, ఢిల్లీ
ఇది కరీంనగరేనా అనిపిస్తుంది..
కేబుల్ బ్రిడ్జి పూర్తయినప్పటి నుంచి ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు చూస్తుం టే ఇది మన కరీంన గరేనా అనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చి కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. వీకెండ్ మస్తీలో హైదరాబాద్ తరహా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం బాగుంది.
– ఎలగందుల సుధ, కరీంనగర్
మంచి ప్రోగ్రాం..
తీగల వంతెన వద్ద చేపట్టిన వీకెండ్ మస్తీ చాలా మంచి ప్రోగ్రాం. కార్యక్రమాలు బాగున్నాయి. నగరవాసులంతా ఆదివారం ఆటవిడుపుగా ఇక్కడికి కుటుంబ సభ్యులతో వచ్చి ఆస్వాదించేలా ఉన్నాయి. వారం మొత్తం పడ్డ కష్టం ఇక్కడి కార్యక్రమాలు చూస్తూ మరిచిపోయి సేద తీరవచ్చు. మ్యూజిక్, సాండ్ ఆర్ట్ కార్యక్రమాలు కొత్తగా ఉన్నాయి.
– మౌనిక, కరీంనగర్