కొత్తపల్లి, నవంబర్ 25 : సమైక్యపాలనలో 40 ఏళ్ల పాటు దరిద్రాన్ని అనుభవించామని, పదేళ్ల తెలంగాణ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు మరోసారి పట్టంకట్టాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం కొత్తపల్లి మండలంలోని బావుపేటలో ఆయన ఎన్నికల ప్రచారం చేయగా, ప్రజలు పూలమాలలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి చెందిన తెలంగాణను చూసి సమైక్యపాలకుల కడుపులు మండుతున్నాయని, ఎన్నికల పేరుతో రాష్ర్టాన్ని దోచుకొనే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు.
కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బండి సంజయ్ పెద్ద దొంగ అని, గుండెపోటు డ్రామాలాడి ఎంపీ ఎన్నికల్లో గెలుపొంది రూ.వందల కోట్లు అక్రమంగా కూడబెట్టాడని చెప్పారు. నాలుగున్నరేళ్లలో ఎన్నడూ కనిపించని ఆయనకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చారని, కరీంనగర్ ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా అభివృద్ధి కోసం ఒక రూపాయి కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. ఆయన కంటే తానే పెద్ద హిందువునని, టీటీడీ, ఇసాన్ దేవాలయాలను కరీంనగర్లో నిర్మిస్తున్నానని, బండి సంజయ్ ఒక్కటైనా కట్టాడా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే టికెట్ల దుకాణం పెట్టి కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శించారు. డబ్బులు ఇవ్వలేదని కారణంతోనే బీసీ బిడ్డ తుల ఉమకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశాడన్నారు. టిక్కెట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డాడనే కారణంతోనే ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని తెలిపారు. కూడబెట్టిన అవినీతి సొమ్ముతో ఒక్కో ఓటుకు రూ.20 వేలు, సెల్ఫోన్ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. కాంగ్రెస్లో రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని, అందుకనే కరీంనగర్ టిక్కెట్ను భూకబ్జాలు చేసిన, 32 కేసులున్న రౌడీ షీటర్కు కేటాయించారని తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో తాను చేసిన అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
తెలంగాణ రాకముందు కరీంనగర్ టూ వేములవాడ రోడ్ ఎలా ఉండేదని, ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. బావుపేట అంటే తన సొంతూరులాంటిదని, గత ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి 490 ఓట్ల మెజార్టీని అందించారని కృతజ్ఞతలు తెలిపారు. ఎండిపోయిన చెరువులకు వరదకాలువ నుంచి నీటిని తెచ్చి పూర్వవైభవం తీసుకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. అంతకు ముందు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు ఆధ్వర్యంలో చింతకుంట వద్ద వందలాది బైకులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, జడ్పీటీసీ పిట్టల కరుణ, సర్పంచ్ కడారి శాంత శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్, ఎంపీటీసీ దావ కమల మనోహర్ పాల్గొన్నారు.