కార్పొరేషన్, నవంబర్ 24 : బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఇప్పించిందే ఆయన అని, ముస్లింల ఓట్లను చీల్చాలని ఇద్దరు కలిసి కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 51, 13 డివిజన్లలోని టవర్సర్కిల్, రాంచంద్రాపూర్ కాలనీల్లో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నా భార్యా పిల్లలతో కలిసి నేను దుబాయ్ పోతే బండి సంజయ్ నా ఇంటిపై ఐటి దాడులు చేయించిన దుర్మార్గుడని విమర్శించారు. దీంతో తాను తెల్లారే తిరిగి రావాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అధికార దుర్వినియోగం చేసి నా ఇంటి తాళం పగులగొట్టించి అరాచకం సృష్టించారని విమర్శించారు. స్మార్ట్సిటీ తెచ్చినట్టు చెప్పుకుంటున్న బండి సంజయ్ వేంకటేశ్వర దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అని సవాల్ విసిరారు.
స్మార్ట్సిటీ వచ్చినప్పుడు ఆయన కార్పొరేటర్గానే ఉన్నాడని గుర్తు చేశారు. హైదరాబాద్ను కాదని కరీంనగర్కు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఆ సమయంలో అప్పటి ఎంపీ వినోద్కుమార్, తాను, కార్పొరేటర్లతో ఢిల్లీకి వెళ్లి అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలుసుకొని సాధించుకున్నట్లు చెప్పారు. అప్పుడు కూడా కార్పొరేటర్గా ఉండి కూడా ఢిల్లీ రాకుండా ముఖం చాటేసిన వ్యక్తి బండి సంజయ్ మండిపడ్డారు. స్మార్ట్సిటీని 2015లో సాధించుకొని పనులు చేపట్టామన్నారు. ఇప్పుడు స్మార్ట్సిటీ తాను తీసుకువచ్చానని దొంగ మాటలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. రెండు సార్లు తనపై పోటీ చేసి ఓడిపోయి 2019 ఎన్నికల్లో గుండెపోటు డ్రామాలు చేసి ఎంపీగా గెలిచాడని దుయ్యబట్టారు. తాను కరీంనగర్లో అభివృద్ధి చేసి వాటిని చెప్పి ఓట్లు అడుగుతున్నానని, మరి బండి సంజయ్ ఏం అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాడో చెప్పాలన్నారు.
ఎంపీగా గెలిచిన తర్వాత బండి ఎప్పుడైనా కనిపించాడా? అని ప్రశ్నించారు. వారి పార్టీ అతడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే టికెట్ల దుకాణం పెట్టి అమ్ముకున్నాడని విమర్శించారు. పైసలు ఇవ్వలేదని బీసీ బిడ్డ తుల ఉమకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్నాడని తెలిసే ఆ పార్టీ అధిష్ఠానం మెడలు పట్టి తోసిందని ఎద్దేవా చేశారు. వ్యాపారుల వద్ద తాము ఎప్పుడైనా డబ్బులు, చందాలు తీసుకున్నామా? అని అడిగారు. అదే బండి సంజయ్ గెలిస్తే చందాలతో ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పారు. తాను ఎప్పటికీ వ్యాపారులకు అండగా నిలుస్తానని, తాను కూడా ఒక వ్యాపారినేనని, 35 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారాన్ని చట్టబద్దంగా చేస్తున్నానని తెలిపారు. గత ఆరేళ్లుగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నానని, ఎవరినైనా రూపాయి అడిగానా? అని ప్రశ్నించారు. తాను దేవుడిని మనసులో పెట్టుకొని పూజిస్తే వాళ్ళు రాజకీయ స్వార్థం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో పైస్థాయి నాకులు వస్తే వ్యాపారుల నుంచి చందాలు వసూలు చేసే రోజులుండేవని, కేసీఆర్ పాలనలో బంద్లు లేకుండా పోయాయని, ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు చెప్పారు.
20 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా బతికానన్నారు. మళ్లీ గెలిపిస్తే ఐదేళ్లు అభివృద్ధి వేగంగా సాగుతుందన్నారు. మొదలు పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో గొప్ప నగరంగా కరీంనగర్ మారుతుందన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నయా పైసా తెచ్చానని దేవాలయంలో బండి సంజయ్ ప్రమాణం చేస్తాడా? అని ప్రశ్నించారు. ఈసారి గెలిపిస్తే తాను కరీంనగర్కు మల్టీనేషనల్ కంపెనీలను తీసుకువచ్చి 10 వేల మందికి ఉపాధి కల్పించడాన్ని ఛాలెంజ్గా తీసుకొని పని చేస్తానన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదని, దానికి ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. వ్యాపారులు కష్టార్జితాన్ని చందాలుగా ఇవ్వొద్దని కోరారు. బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మతఘర్షణలు వస్తాయని, తనను ఆశీర్వదిస్తే శాంతిభద్రతలు సక్రమంగా ఉండేలా చూస్తానన్నారు.
తనను తిడితే ఓట్లు పడవని, ప్రజలకు ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని బండి సంజయ్కు హితవుపలికారు. నగరంలో నిర్మించ తలపెట్టిన టీటీడీ, ఇస్కాన్ ఆలయాల నిర్మాణం కోసం కోటి రూపాయాలైనా తీసుకువచ్చే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ హిందువు అయితే తాను హిందువును కాదా? అని నిలదీశారు. అన్ని మతాలను గౌరవిస్తామని, ప్రజలు అభివృద్ది, శాంతిని కోరుకుంటారని పేర్కొన్నారు. లంచగొండులు, అవినీతి పరులకు ఓటు వేయద్దని కోరారు. ప్రచారంలో రాష్ట్ర సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్, వంగల పవన్, మునీందర్, ప్రేంకుమార్ ముందడా, ఏవీ రమణ పాల్గొన్నారు.