కార్పొరేషన్, జనవరి 29: ‘ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నాం. పారదర్శకమైన పాలన అందిస్తున్నాం. మూడేండ్లలో 1379 కోట్లు మంజూరు చేసి కరీంనగర్ రూపురేఖలు మార్చినం. ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తూ నగర ప్రజలు మెచ్చేలా పాలన అందిస్తున్నాం’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ను రాష్ట్రంలోనే రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. నగరంలో 1882 అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 961 పనులు పూర్తి చేశామని, మిగిలిన 921 పనులను గడువులోగా కంప్లిట్ చేస్తామని చెప్పారు.
కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం మూడేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంత్రి స్థానిక శ్వేత హోటల్లో మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగరాధ్యక్షుడు చల్లా హరిశంకర్తో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రతిపక్ష పార్టీల విమర్శలను పట్టించుకోబోమని తేల్చిచెప్పారు. తమకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన నగరవాసుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
కేసీఆర్కు కరీంనగర్పై ప్రత్యేకాభిమానం
సీఎం కేసీఆర్కు కరీంనగర్ అంటే ప్రత్యేకాభిమానమని, అందుకే అడిగిన వెంటనే నిధులిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి 2కోట్లు ఇవ్వాలని నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్కుమార్ను అడిగితే, ఎగతాళి చేశారే తప్ప నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఏ ర్పాటైన తర్వాతే సీఎం కేసీఆర్ విరివిగా నిధులిస్తున్నారన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పనితీరు కు మెచ్చే రెండోసారి అధికారమిచ్చారని చెప్పా రు.
వారి నమ్మకానికి అనుగుణంగా రా ష్ట్రంలోనే అత్యధికంగా నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. 24 గంటల మంచినీరు సరఫరా చేస్తున్న ఘనత ఈ పాలకవర్గానికే దక్కిందని చెప్పారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తున్నామని పునరుద్ఘాటించారు. నగరంలో 1882 పనులు చేపడుతున్నామన్నారు.వీటిలో 459 కోట్లతో చేపట్టిన 961పనులు పూర్తయ్యాయని, 663 కోట్లతో చేపడుతున్న 160 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 93 కోట్లతో చేపట్టాల్సినా 175 పనులు టెండర్లు పూర్తయ్యాయని, మరో 162 కోట్లతో చేపట్టాల్సిన 586 పనులకు టెండర్లు పిలువాల్సి ఉందన్నారు.
వేగంగా రివర్ఫ్రంట్..
కరీంనగర్లో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ తెలంగాణకే గొప్ప ఆస్తిగా మిగులుతుందని మంత్రి చెప్పారు. ఈ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ ప్రపంచంలో చైనా, సియోల్ (సౌత్ కొరియా) తర్వాత ప్రపంచంలోనే మూడో అద్భుతమైన ఫౌంటేన్ను నిర్మిస్తున్నామని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరాయని పేర్కొన్నారు. కోరిన వెంటనే సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేశారని, దీనిని కొత్తపల్లిలో 25 ఎకరాల్లో స్థలాల్లో నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. వైద్యకళాశాలలో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
అద్భుతంగా నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను ఈనెల 31న ప్రారంభిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళా డిగ్రీ గురుకుల కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు ముగ్దుంపూర్లో 50 ఏకరాల స్థలాన్ని కేటాయించామని చెప్పారు. బయట 50 వేలకు అందించే అగ్రికల్చర్ విద్యను ఇక్కడ 5వేలకే అందిస్తామని పేర్కొన్నారు. పద్మనగర్ వద్ద టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వచ్చే రెండేళ్లలో నగరాన్ని మరింత అద్భుతంగా తయారుచేస్తామని ప్రకటించారు.
రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాం
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న గణేశ్నగర్, అంబేద్కర్ స్టేడియం చుట్టూ రోడ్డు, రాజా థియేటర్ రోడ్డు ఇలా అనేక రహదారులను సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. సీఎం అస్యూరెన్స్ నిధులు 87 కోట్లతో కోతిరాంపూర్ చౌరస్తా నుంచి గిద్దెపెరుమాండ్ల ఆలయం మీదుగా కట్టరాంపూర్ వరకు, మంకమ్మతోట స్వాతి బుక్ స్టాల్ నుంచి జ్యోతినగర్ మీదుగా మోర్ సూపర్ మార్కెట్ వరకు, స్పెన్సర్ నుంచి సెయింట్ జాన్స్ స్కూల్ వరకు ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలోని 13 ఐలాండ్స్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
రోడ్డులపై వ్యాపారాలు సాగకుండా ఉండేందుకు వీలుగా నగరంలోని నలువైపుల సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయ విస్తరణ కోసం 2 కోట్లను కేటాయించామన్నారు. ఈ యేడాది ఆఖరుకు హౌసింగ్బోర్డు రిజర్వాయర్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టు కింద 24 గంటల మంచినీరు సరఫరా చేస్తామన్నారు. అన్ని డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతకుముందు మూడేళ్లపాలన పూర్తయిన సందర్భంగా భారీ కేక్ను మంత్రి కట్ చేసి మేయర్కు తినిపించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మంత్రి గంగులను గజమాలతో సత్కరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.