కార్పొరేషన్, నవంబర్ 16: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై అవినీతి ఆరోపణలు రావడం వల్లే ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, అవినీతితో సంపాదించిన డబ్బుల మూటలతో ఈ ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు చూస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఓటుకు రూ.20 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నగరంలోని 41, 43వ డివిజన్లలో నగర మేయర్ వై సునీల్రావుతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
అనంతరం పుష్పాభిషేకం చేసి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని ఎందుకు తొలగించారో ప్రజలకు చెప్పాలన్నారు. పదవిని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయల అవినీతి చేశారన్న ఆరోపణలు రావడంతో తొలగించారని విమర్శించారు. ఇప్పుడు ఆ మూటలతో కార్యకర్తలకు లక్షలు పంచుతున్నారని, ఓట్లను కూడా కొంటామంటున్నారని ఆరోపించారు. ఎంపీగా గెలిచిన నాలుగున్నర ఏండ్లలో ఎప్పుడైనా ఈ కాలనీలకు సంజయ్ వచ్చారా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి కోసం ఒక్క రూపాయైనా తీసుకువచ్చారా అని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిపై భూకబ్జాలకు సంబంధించి 32 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రౌడీషీటర్ అయిన వారికి ఓట్లు వేస్తే మన భూములు మిగులుతాయా? అని ప్రశ్నించారు. తాము ఈ పదేళ్లలో రూ.వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఈ ఎన్నికల్లో మనం తప్పు చేస్తే భవిష్యత్తు తరాల నోట్లో మట్టికొట్టినట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే అధికారం ఆంధ్రా నాయకుల చేతుల్లోకి పోతుందన్నారు. మళ్లీ అరిగోస పడాల్సి వస్తుందన్నారు. వీటిని ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. ఓవైపు అవినీతి బీజేపీ అభ్యర్థి, మరోవైపు భూకబ్జాల కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారని.. మచ్చ లేని తనకు ఓటు వేసి మరోసారి ఆశీర్వాదం అందించాలన్నారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి గంగుల కోరారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు బండారి వేణు, సరిళ్ల ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు బిట్టు, ప్రశాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.