కరీంనగర్ రూరల్, డిసెంబర్ 11: కరీంనగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 43.51 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గోపాల్పూర్లోని మల్లన్న ఆలయానికి వెళ్లే రోడ్డుకు రూ. 95 లక్షలు, చెర్లభూత్కూర్-తాహెర్కొండాపూర్ రోడ్డుకు రూ. 22 లక్షలు, చామనపల్లి-బహ్దూర్ఖాన్ పేట రోడ్డుకు రూ. 88 లక్షలు, బహ్దూర్ఖాన్పేట నుంచి తాహెర్కొండాపూర్ రోడ్డుకు రూ. 3 కోట్ల 65 లక్షలు, చామనపల్లి-చాకుంట రోడ్డుకు రూ. కోటి 95 లక్షలు, చెర్లభూత్కూర్ చౌరస్తా నుంచి దుబ్బపల్లి మీదుగా వయా ప్రశాంత్నగర్ కాలనీ రోడ్డుకు రూ. 4 కోట్ల 29 లక్షలు, దుర్శేడ్-గుంటూర్పల్లి రోడ్డుకు రూ. కోటి 86 లక్షలు, హబీబ్ బావి నుంచి నగునూర్ ఆర్అండ్బీ రోడ్డుకు రూ. కోటి 86 లక్షలు, పోచమ్మకుంట ఆర్అండ్బీ రోడ్డుకు రూ. 2 కోట్ల 43 లక్షలు, ఇరుకుల్ల-చెర్లభూత్కూర్ మీదుగా ఎలబోతారం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. కోటి 48 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.