74వ ‘గణ’తంత్ర వేడుకలు ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటాయి.. గురువారం ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ ద్వానాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.. అంతటా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి.. కరీంనగర్లోని కేసీఆర్ భవన్లో మంత్రి గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి కలెక్టరేట్లలో కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, జీ రవి, అనురాగ్ జయంతి, డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అంతకుముందు ఆయాచోట్ల చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
– కార్పొరేషన్/ కలెక్టరేట్, జనవరి 26
74వ గణతంత్ర వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్, మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం చిన్నారులకు డిక్షనరీలు పంపిణీ చేసి, మూడు రంగుల్లో రూపొందించిన బెలూన్ పటాలాన్ని గాలిలోకి ఎగరేశారు.
సమర యోధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఫొటోలు దిగారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో జిల్లా జడ్జి బీ ప్రతిమ, పోలీస్ కమిషనరేట్లో సీపీ సత్యనారాయణ, జడ్పీ కార్యాలయంలో సీఈవో ప్రియాంక జాతీయ పతాకాలను ఎగురవేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. రామడుగు మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, హుజూరాబాద్ పట్టణంలోని లారీ అసోసియేషన్ వద్ద ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జాతీయ జెండాలను ఎగురవేశారు.
– కార్పొరేషన్/ కలెక్టరేట్, జనవరి 26