మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం
పనుల బాధ్యతలు అదనపు కలెక్టర్కు
వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్, జూలై 4: స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న టవర్సర్కిల్ సుందరీకరణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే పనులు కాస్తా ఆలస్యమయ్యాయని, ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కు అప్పగిస్తామని వెల్లడించారు. సోమవారం నగరంలోని టవర్సర్కిల్లో సాగుతున్న స్మార్ట్సిటీ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో ఆలస్యానికి కారణమైన కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కరీంనగర్ను తెలంగాణలోనే రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్ను కాదని స్మార్ట్సిటీగా కరీంనగర్కు అవకాశం ఇచ్చారన్నారు. ఇందులో భాగంగా సీఎం అస్యూరెన్స్, ఇతర నిధులు, స్మార్ట్సిటీ నిధులతో కేసీఆర్ (కరీంనగర్ సిటీ రెనోవేషన్ పథకం)తో కరీంనగర్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
అంతర్గత రోడ్ల అభివృద్ధ్దితోపాటు నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 2014 నుంచి కరీంనగర్లో అభివృద్ధి వేగవంతమైందన్నారు. స్మార్ట్సిటీలో భాగంగా కరీంనగర్కు గుండెకాయలాంటి టవర్సర్కిల్ను అమృత్సర్ తరహాలో తీర్చిదిద్దాలని మొదటి విడుతలోనే పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ అభివృద్ధి పనులను బెంగళూరుకు చెందిన కాంట్రాక్టర్కు అప్పగించగా.. నగరంలో ఇతర అన్ని స్మార్ట్సిటీ పనులు శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ టవర్సరిల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆలస్యమవుతున్నాయని తెలిపారు. 60సీ ద్వారా కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్కు పనులను అప్పగిస్తామని పేర్కొన్నారు.
అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ పనులతో వీటిని పూర్తి చేస్తామన్నారు. నిర్దేశిత డిజైన్ల ప్రకారమే పనులు సాగుతున్నాయన్నారు. స్థానిక వ్యాపారులు, ఇండ్ల యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పనులు చేస్తామన్నారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అలాగే టవర్సర్కిల్ ప్రాంతంలోకి టూ, ఫోర్ వీలర్ వాహనాలను అనుమతించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై సునీల్రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కమిషనర్ సేవా ఇస్లావాత్, స్థానిక కార్పొరేటర్ రవీందర్సింగ్, విద్యుత్ ఎస్ఈ పాల్గొన్నారు.