మంథని, మార్చి 2 : మంథని ప్రాంతంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిషరించాలనేది తన తండ్రి శ్రీపాదరావు లక్ష్యమని, ఆ మేరకు తాను కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.
శనివారం శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా ఆయన మంథనిలోని శ్రీపాదచౌక్ వద్ద శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీపాదరావు జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమారల దృష్టికి తీసుకెళ్లారని, వారి కోరికను అంగీకరించినట్లు గుర్తు చేశారు.
అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంథని ప్రాంతంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిషరించేందుకు లిప్ట్ను వేగవంతంగా ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టు వరకు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని, దీనిని పరిష్కరించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి రైతుకు అవసరమైన మేర సాగునీరు అందించాలని, నీటి దుర్వినియోగం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
శ్రీపాదరావు ఆలోచనల మేరకు మంథని నుంచి శివారం వరకు రూ.125 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత మంథని పట్టణం వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం రావుల చెరువు వద్ద శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మంథనిలోని సామాజిక దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు.