మంథని, డిసెంబర్ 18 : మంథని నియోజకవర్గంలో బస్సులు లేని గ్రామాలన్నింటికీ బస్సులు వేయాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కరీంనగర్ ఆర్ఎం సుచరిత సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించడంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతి రోజూ 2 లక్షల 40 వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని, ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షల 70 వేలకు పెరిగిందని, ఇందులో 60 శాతం మహిళలే ప్రయాణిస్తున్నారని ఆర్ఎం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బస్సులు నడిపించాలన్నారు. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా బస్సులు పెంచాలన్నారు. అవసరమైన రూట్లలో ఆదనపు ట్రిప్పులు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలకు సుపరిపాలన అందిస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా, మంత్రి క్రైస్తవులతో కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంథని డివిజన్ పాస్టర్స్ సంఘం గౌరవాధ్యక్షుడు పాస్టర్ ఎలిషా, అధ్యక్షుడు శ్రీనువాస్ పాల్, సెక్రెటరీ పాస్టర్ కృపాకర్, కార్యదర్శి పాస్టర్ డేవిడ్ పాల్గొన్నారు.