కరీంనగర్ విద్యానగర్, మే 13 : ప్రైవేట్ దవాఖానాల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. కరీంనగర్లోని వన్ హాస్పిటల్లో లిఫ్ట్ తెగిపడగా, అందులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు త్రుటిలో ముప్పు తప్పింది. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఓ రైతు వన్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, అతన్ని పరామర్శించేందుకు బుధవారం మంత్రి అడ్లూరి వెళ్లారు. దవాఖానలోని లిఫ్ట్ ఎకి మూడో ఫ్లోర్కి వెళ్లగానే, ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడిపోవడంతో అందరూ భయాందోళన చెందారు. అయితే మంత్రితోపాటు పలువురు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం బయటికి రావడంతో చాలామంది నాయకులు మంత్రికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
దవాఖానలో లిఫ్ట్కు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయపోవడంతోనే ఇలా జరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులు వెళ్లే లిప్ట్లపై యజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. అలాగే, ఆర్ఎంపీలతో సంబంధాలు పెట్టుకొని నగరంలో పలు దవాఖానల నిర్వాహకులు దందా చేస్తున్నారని, నిజానికి చాలా మంది యజమానులకు కనీసం మెడికల్ నాలెడ్జ్ లేదని విమర్శించారు. ఎంబీబీఎస్ చదివిన వారిని పెట్టుకొని నడుపుతున్నారని, తమకు సమాచారం ఉందని అధికారులపై ఆగ్రహించారు. వెంటనే నగరంలోని అన్ని ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం నడుచుకోని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఐదో ఫ్లోర్ నుంచి పడి ఉంటే ఈరోజు తనతోపాటు మరి కొంతమంది ప్రాణాలు పోయేవని, దీనికి బాధ్యత ఎవరిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతోపాటు పోలీసులకు స్వయంగా తానే తన పీఏ ద్వారా ఫిర్యాదు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఘటన జరిగి అరగంటకు పైగా సమయం అవుతున్నా దవాఖాన యజమాన్యం ఒక్కరు కూడా రాలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరీంనగర్ ఒక మెడికల్ మాఫియాగా మారిందని, పేదలను దోచుకుంటున్నారని, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.