Minister Adluri | ధర్మారం,జూన్ 30 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజనం మెనూ అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కిచెన్, డైనింగ్ హాల్ తో పాటు స్టోర్ రూమ్ ను ఆయన పరిశీలించారు. మల్లాపూర్ గురుకుల పాఠశాలకు సరఫరా చేసిన సన్న బియ్యాన్ని మంత్రి పరిశీలించారు.
బియ్యంలో నూకల శాతం ఎక్కువ ఉన్నందున బియ్యాన్ని వెనక్కి తీసుకొని సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపించాలని పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల అధికారికి మంత్రి ఫోన్లో మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలలో 27 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య అందుతుందని, విద్యార్థులకు యూనిఫామ్స్ తో పాటు విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లువివరించారు. మంత్రి వెంట ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లనాయక్, నాయకులు తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.