ముంపు గ్రామాల చుట్టూ రక్షణ
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూస్తాం
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం
తొమ్మిది మంది వలస కార్మికులను కాపాడాం
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ మండలంలో పర్యటన
కాలినడకన సహాయక చర్యల పర్యవేక్షణ.. బాధితులకు భరోసా
కరీంనగర్ రూరల్, జూలై 14: కరీంనగర్ జిల్లాలో వరద ముప్పు తప్పించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని చెప్పారు. నగునూరు శివారులో వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది ఒడిషాకు చెందిన వలస కార్మికులను కాపాడామన్నారు. అగ్రిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని బోటు ద్వారా సురక్షితంగా బయటకు తెచ్చి తీగలగుట్టపల్లి పునరావస కేంద్రానికి తరలించామన్నారు. కరీంనగర్ మండలంలోని వల్లంపహాడ్ నుంచి తీగలగుట్టపల్లి వరకూ గురువారం మంత్రి వర్షంలోనే పర్యటించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి బాధితులను ఓదారుస్తూ.. అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకుసాగారు. నగునూరు వాగుపై ఉన్న నారాయణపూర్కు చెరువుకు గండిపడగా మంత్రి పరిశీలించారు.
నగునూర్ చెక్డ్యాంను సందర్శించి వరద ప్రవహన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరదలపై అనుక్షణం సమీక్షిస్తున్నామని చెప్పారు. మానేరు ముంపు గ్రామాలైన నగునూరు, ఇరుకుల్ల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. విరివిగా కురుస్తున్న వర్షాలతో అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నదన్నారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. వర్ష ప్రభావిత గ్రామాల్లో సంచార వైద్యబృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రజలు సైతం సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నీటికుంటలు, కరెంట్ స్తంభాల వద్దకు వెళ్లకుండా చూడాలని విన్నవించారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా హరిశంకర్, అదనపు కలెక్టర్ గరిమాఅగ్వరాల్, ఏసీపీ కమలాకర్, సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, కార్పొరేటర్లు బండారి వేణు, కాశెట్టి లావణ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, తహసీల్దార్ నల్లవెంకట్రెడ్డి. సీఐ విజ్ఞాన్రావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, మునీరాజ్, చల్ల లింగారెడ్డి, సుంకిశాల సంపత్రావు, కార్యదర్శి కిరణ్కుమార్, కస్తూరి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.