కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క్ఫోర్స్ తనిఖీల్లో బట్టబయలైంది. ఇతర ప్రాంతాలకు, మిల్లులకు అమ్ముకున్నట్లు విచారణలో తేలినట్లు తెలుస్తున్నది. అయితే ఈ బాగోతంలో సివిల్ సప్లయి అధికారుల పాత్ర, తదితర అంశాలపై టాస్క్ఫోర్స్ నివేదిక తయారు చేసి, రాష్ట్ర ఉన్నతాధికారులకు అందించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
జమ్మికుంట, డిసెంబర్ 31: రైతుకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ప్రభు త్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నది. సదరు ధాన్యాన్ని సీఎమ్మార్ పేరిట మిల్లర్లకు అందిస్తున్నది. ధాన్యాన్ని మర పట్టించి క్వింటాల్కు 67 కిలోల చొప్పున బియ్యాన్ని మూడు నెలల్లోపు పౌరసరఫరాల శాఖ/ఎఫ్సీఐకి లెవీగా పెట్టాల్సి ఉంది. అయితే, సీజన్లు మారినా.. సీఎమ్మార్కు మిల్లర్లు ససేమిరా అనడం ఆనవాయితీగా మారింది. సీఎమ్మార్ ధాన్యాన్ని, బియ్యా న్ని అమ్ముకోవడం.. సొమ్ముచేసుకోవడం జరుగుతున్నది. అలా రూ.కోట్లు కొల్లగొడుతూ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అధికారులను మేనేజ్ చేస్తూ మళ్లీ ఏటా సీఎమ్మార్ తీసుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లాలో వందలాది రైస్ మిల్లులున్నాయి. అయితే, హుజూరాబాద్ డివిజన్ మాయగాళ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అనేకసార్లు హుజూరాబాద్, జమ్మికుంట మిల్లులపై టాస్క్ఫోర్స్, విజిలెన్స్, సివిల్ సైప్లె అధికారులు దాడులు చేశారు. కొన్ని మిల్లుల్లో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. కొన్ని మిల్లుల్లో సీఎమ్మార్ పక్కదారి పట్టించడంపై కేసులు నమోదు చేశారు. అయినా దందా మారలేదు సరికదా.. మరింతగా పెరిగిన సందర్భాలున్నాయి. అందుకు అధికారుల అండదండలే కారణమన్న ఆరోపణలున్నాయి. నాడు ఈ మిల్లర్ల దందాలకు చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, ఉన్నతాధికారులే రంగంలో దిగారు. మోసాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.