మెట్పల్లి, జనవరి10: మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మెట్పల్లికి రాకపోకలు సాగిస్తుంటారు. వీరి కోసం పదిహేను ఏండ్ల నుంచి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు (మెట్పల్లి-పామూరు) నడుస్తున్నది. ఈ బస్ సర్వీస్తో డిపోకు లాభమే తప్ప నష్టమే లేదు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడంతో పామూరు-మెట్పల్లి మధ్య నడిచే బస్సుకు బ్రేక్ పడింది. దీంతో వలస కార్మికులు ఇబ్బందిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్టీసీ కరీంనగర్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరెడ్డిని వివరణ కోరగా, మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అంతర్గత బస్ సర్వీసులను పెంచడం కోసం మెట్పల్లి-పామూరు మార్గంలో నడిచే ఎక్స్ప్రెస్ బస్ను రద్దు చేసినట్లు వివరించారు.