పెద్దపల్లిటౌన్, అక్టోబర్ 2 : రక్తదానం.. మరొకరికి ప్రాణదానం చేయడం లాంటిదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సోమవారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసులు 6006 మందితో రక్తదానం చేయాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అథితిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున మెగా రక్తదానం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.
ఇప్పుడిప్పుడే కృత్రిమ శరీర అవయవాలు తయారు చేస్తున్నారని, కానీ రక్తం మాత్రం తయారు చేసే పరిస్థితి లేదన్నారు. రక్తం కోసం అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల అవసరాల కోసం నిరంతరం రక్తదాన శిబిరాలు కొనసాగాలని అకాంక్షించారు. జిల్లా నలూమూల నుంచి విద్యార్థులు యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఎక్కడా జరుగని విధంగా పెద్దపల్లిలో ఇంత పెద్ద రక్తదాన శిబిరం జరగడం జిల్లా ప్రజలకు, పోలీసులకు గర్వకారణమన్నారు.
ఇంత పెద్ద కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడం ఖాయమన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్కు చెందిన డీఎంఆర్ మెగా బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ పెద్దపల్లి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రాజ్కుమార్ 90 సార్లు రక్తదానం చేయడం గొప్ప విషయమని ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్ దంపతులు ముజమ్మిల్ ఖాన్-హమ్నా మరియం ఖాన్కు డప్పు వ్యాయిద్యాలు, మహిళల కోలాట బృందాలు, ఆటాపాటలతో ఘన స్వాగతం పలికారు. కలెక్టర్తో పాటు ఆయన సతీమణి రక్తదానం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రక్తదానం చేసిన యువతీ యువకులకు సర్టిఫికెట్లు, ప్రసంసాపత్రాలు అందజేశారు. మెగా రక్తదాన శిబిరంలో దాదాపు 19 బ్లడ్ బ్యాంక్లు పాల్గొన్నాయి. శిబిరాన్ని విజయవంతం చేసిన యువతకు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి కృతజ్ఞలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి బల్దియా చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, పెద్దపల్లి-జూలపల్లి ఎంపీపీలు బండారు స్రవంతి-శ్రీనివాస్ గౌడ్, కూసుకుంట్ల రమాదేవి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు ఎడ్ల మహేశ్, తుల శ్రీనివాస్రావు, తిరుపతిరెడ్డి, మోహన్, సీఐలు బర్ల అనిల్కుమార్, జగదీశ్, సత్యనారాయణ, ఎస్ఐలు మహేందర్, శ్రీనివాస్, శ్రీధర్, రామకృష్ణ, రెడ్ క్రాస్సొసైటీ సభ్యులు శ్రీనివాస్రావు, కావేటి రాజగోపాల్ పాల్గొన్నారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుకు ప్రయత్నం
పెద్దపల్లి, అక్టోబర్2(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. యువతీ యువకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ దంపతులు రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. 6006 మందితో రక్తదానం చేయించాలని పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసులు అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
గత రెండు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించి, రక్తదానంపై ఉన్న అపోహను తొలిగించారు. దీంతో అనుకున్న లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో 6,166 మంది రక్తదానం చేయడంతో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కోసం పంపుతున్నట్లు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మొత్తంగా కార్యక్రమం విజయవంతం కావడంతో ‘శభాష్పోలీస్’ అని మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కితాబిచ్చారు. శాంతి భద్రతలు కాపాడటంతోపాటు సమాజ హితం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని జిల్లా ప్రజలు ఆకాంక్షించారు.
అభివృద్ధికి పాటుపడుతాం
గాంధీ జయంతి రోజున పోలీసులు రక్తదానం చేయడం గొప్ప విషయం. సీఏం కేసీఆర్, ఐటీ యూత్ ఐకాన్, మంత్రి కేటీఆర్ మార్గనిదేశంలో పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి పాటుపడుతాం. వారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
– బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పెద్దపల్లి ఎంపీ
ప్రజలకు మరింత దగ్గరయ్యారు
ఒకే రోజున 6006 మంది రక్తదానం చేయడం కోసం పెద్దపల్లి పోలీసులు ఎన్నో రోజులు కష్టడ్డారు. ప్రతి గ్రామం నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో యువతకు అవగాహన కల్పించి శిబిరానికి తరలించడం గొప్ప విషయం. పోలీసులు చేపట్టిన మెగా రక్తదాన శిబిరంతో వారు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. పోలీసులు పెట్టుకున్న 6006 లక్ష్యాన్ని ఛేదించి 6166 మంది రక్తదానం చేసేలా కృషి చేశారు.
– దాసరి మనోహర్రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే