E-pharmacy policy | రాజన్నసిరిసిల్ల,మే15( నమస్తే తెలంగాణ) : రోగులకు అవసరమైన ఔషధాలను విక్రయించే విధానంలో ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఫార్మసీ రద్దు చేయాలని నిరసనగా ఈ నెల 20 న దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ లను ఒక రోజు బంద్ కు పిలుపు నిచ్చారు. తెలంగాణ కెమిస్ట్రీ అండ్ డ్రగ్జిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఆధ్వర్యంలో బంద్ కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫార్మా రంగాన్ని ప్రభావితం చేస్తున్న పలు సమస్యలపై ఇప్పటికే విజ్ఞప్తులు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఈ ఫార్మసీ విక్రయాల ద్వారా ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉందని అన్నారు. ఆధునిక సాంకేతికతను అడ్డుపెట్టుకొని నకిలీ ప్రిస్క్రిప్షన్ ల ద్వారా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని హెచ్చరించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరిన స్పందించడం లేదని ఆరోపించారు. కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవడమే కాకుండా, దేశంలో ఈ ఫార్మసీ విధానాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటుల అనైతిక డిస్కౌంట్ లను అరికట్టేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మందుల దుకాణాల యజమానుల సమస్యలపై ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ లను బంద్ చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి టీ రాజు, ట్రెజరర్ పీ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.