జగిత్యాల/జగిత్యాల అర్బన్, మార్చి 18: జీతాల కోసం వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన బాటపట్టారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటూ నిరసన వ్యక్తం చేశారు. అయితే సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తూనే నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సెకండ్ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ పెండిం గ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఏడు నెలల పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలన్నారు. అలాగే ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. జీతాల కోసం మూడు నెలలపాటు వేచి చూశామని, ఓపిక నశించి విధిలేని పరిస్థితుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. తమ మూడు డిమాండ్లను నెరవేర్చాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా, సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.