జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఇప్పటికే జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడుత కౌన్సెలింగ్లో ఎంపికైన 22 మంది వివిధ రాష్ర్టాల స్టూడెంట్స్ కళాశాలలో రిపోర్టు చేయగా, పూర్తి స్థాయి సిబ్బంది సైతం విధుల్లో చేరడంతో తుది దశ పనులను వేగవంతం చేసింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో మూడు సబ్జెక్టుల టీచింగ్కు గాను అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్ను విద్యార్థుల కోసం రెండు వసతి గృహాలను సిద్ధం చేసింది.
జగిత్యాల, అక్టోబర్ 31, (నమస్తే తెలంగాణ) : జగిత్యాల మెడికల్ కాలేజీ సాకారానికి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఏడాదిన్నరగా శ్రమిస్తూ వచ్చారు. పలు సార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 2018 ఎన్నికల సమయంలో జగిత్యాల వేదికగా ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు 2021 మేలో మంజూరు చేసిన విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీతోపాటు 330 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీని సైతం మంజూరైంది. మొత్తంగా 1001 పోస్టులను ఆర్థికశాఖ మంజూరు చేసింది. మెడికల్ కాలేజీలో బోధన, బోధనతేర సిబ్బంది పోస్టుల మంజూరుతోపాటు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చొరవతో జిల్లా కేంద్రం నడిబొడ్డున మెడికల్ కాలేజికి స్థలం కేటాయింపు జరిగింది. ధరూర్ క్యాంపులో ఉన్న సివిల్ సప్లయ్ గోదాములతోపాటు మరికొన్ని శాఖల గోదాములను సేకరించిన ప్రభుత్వం వాటిలో తాత్కాలికంగా మెడికల్ కాలేజీని నిర్వహించాలని నిర్ణయించింది. వాటి మరమ్మతులు, ఇతర భవనాల నిర్మాణం కోసం 16 కోట్లు కేటాయించింది. దీంతో తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ జగిత్యాల మెడికల్ కాలేజీ భవనాన్ని, సౌకర్యాలను పరిశీలించి, కాలేజీకి 150 మెడికల్ సీట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే బోధన ప్రారంభించేందుకు అన్ని అనుమతులను ఇచ్చింది. అనుబంధంగా 260 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సైతం పూర్తయింది.
ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక చొరవ..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక చొరవ చూపడంతోనే జగిత్యాల మెడికల్ కాలేజీకి అంకురార్పణ జరగడంతోపాటు బోధన సైతం ప్రారంభం కాబోతున్నది. జగిత్యాల జిల్లాగా అవతరించిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత ద్వారా ప్రయత్నించి విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీతో పాటు, అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్కు విన్నవించగా, ఆయన హామీ ఇచ్చారు. సంజయ్కుమార్ చొరవ నేపథ్యంలో మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా దవాఖానను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
15 నుంచే బోధనకు అవకాశాలు..
ఈ నెల 15వ తేదీ నుంచే తరగతులు బోధించేందుకు కాలేజీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 150 మెడికల్ సీట్లను కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, శనివారం వరకు నీట్ ద్వారా జాతీయ స్థాయిలో 15 శాతం ఓపెన్ ఫర్ ఆల్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. జాతీయ స్థాయి కౌన్సెలింగ్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 22 మంది విద్యార్థులను కాలేజీకి కేటాయించారు. అందులో 20 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిపోర్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన సలోని గుప్తా, జగిత్యాల పట్టణంలోని తారక రామానగర్కు చెందిన షేక్ మునావర్ రెండురోజుల క్రితం నేరుగా కాలేజీలో రిపోర్ట్ చేశారు. కాగా, జాతీయ స్థాయిలో మరోసారి నీట్ కౌన్సెలింగ్ ఈ నెల 11 తేదీ వరకు జరిపేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. కాగా, జగిత్యాల మెడికల్ కాలేజీలో మిగిలిన 128 మెడికల్ సీట్లను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 3 నుంచి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఈ ప్రక్రియను చేపట్టి, ఈ నెల 11 నాటికి పూర్తి చేసేందుకు నిర్ణయించగా, అదే రోజు నాటికే జగిత్యాల కాలేజీలో 150 సీట్లు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి బోధన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాల మెడికల్ కళాశాల భవనం (ఫైన), ఫస్ట్టియర్ విద్యార్థులకు సిద్ధమైన ల్యాబ్(ఇన్సెట్)
సకల హంగులతో బోధనకు సిద్ధం..
మెడికల్ కాలేజీ బోధన సకల హంగులతో సిద్ధమైంది. సువిశాలమైన స్థలంలో తాత్కాలిక భవనం రెడీగా ఉన్నది. కాలేజీలో రెండు బ్లాక్లను ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థుల కోసం రెండు లెక్చర్ హాల్స్ను ఏర్పాటు చేశారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అనాటమీ, ఫిజీయాలజీ, బయోకెమిస్ట్రీ తరగతుల బోధన చేయనుండగా, అందుకు సంబంధించిన ల్యాబ్స్లను సిద్ధం చేశారు. ల్యాబ్లో వినియోగించే అన్ని ముడిపదార్థాలను సమకూర్చారు. అనాటమీ తరగతులకు సంబంధించిన బోధన కోసం మృతదేహాలను సైతం స్టోర్ చేసే ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు సబ్జెక్టులకు సంబంధించిన అన్ని చార్ట్స్ను, ల్యాబ్లను, ఈ లైబ్రరీ, జనరల్ లైబ్రరీతోపాటు మెడికల్ జనరల్స్ను సిద్ధం చేశారు. బోధన గదుల్లో అధునాతమైన ప్రొజెక్టర్లను సైతం సమకూర్చారు. అనాటమీ బోధనకు సంబంధించి ఐదు మృతదేహాలను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాలేజీలో చేరే విద్యార్థులకు వేర్వేరుగా రెండు వసతిగృహాలను సైతం సిద్ధం చేశారు. ఇక మూడు సబ్జెక్టుల్లో బోధన చేసేందుకుగాను నలుగురు ప్రొఫెసర్స్, 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఆరుగురు అసోసియేట్ ఫ్రొఫెసర్స్ విధుల్లో చేరారు. వీరితోపాటు అనుబంధ దవాఖానలో వైద్యం కోసం 96 మంది వైద్యులు విధుల్లో చేరారు.
పేదలకు మెరుగైన వైద్యం
మెడికల్ కాలేజీ ఏర్పాటు జగిత్యాల జిల్లా చరిత్రలోనే మేలు మలుపులాంటిది. నిరుపేదంలందరికీ సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సేవలు అందుతాయి. జిల్లాతోపాటు నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సైతం కాలేజీ ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికత, ఔదార్యం, అప్పటి నిజమాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత చొరవతోనే మెడికల్ కాలేజీ, అనుబంధ దవాఖాన ఏర్పాటయ్యాయి. ఆ రెండింటినీ ప్రారంభించుకోబోతుండడం నా జీవితంలో అత్యంత ప్రాధాన్యత గల అంశం. చాలా సంతోషంగా ఉంది. మెడికల్ కాలేజీలో సీట్లు పొంది, విద్యాభ్యాసానికి వస్తున్న వైద్య విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
– డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే