తెలంగాణచౌక్, ఫిబ్రవరి18: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క జాతరకు ఆర్టీసీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నెల 18 నుంచి 25 దాకా జాతర జరుగనుండగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ఈ మేరకు కరీంనగర్ రీజియన్ నుంచి 850 బస్సులను రెడీ చేయగా, ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు, జాతర బస్సును ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత ప్రారంభించారు. జాతరకు రీజియన్ నుంచి 425 బస్సులతో పాటు మరో 425 బస్సులను ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చారు.
కరీంనగర్ నుంచి మేడారం దాకా నడిపిస్తున్న ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.280, పిల్లలకు రూ.210 టికెట్ నిర్ణయించగా, ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరనున్నది. కాగా, భక్తుల సౌకర్యార్థం బస్టాండ్లో చలువపందిళ్లు వేశారు. మంచినీటి వసతి, మరుగుదొడ్లు, విశాంత్రి గదులతోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల సిబ్బందిని జిల్లా కేంద్రంతో పాటు మేడారం కరీంనగర్ రీజియన్లో క్యాంపులో విధులు కట్టబెట్టారు. కాగా, మహాలక్ష్మి స్కీం నేపథ్యంలో మహిళలు అధికంగా వెళ్లే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా మహిళా పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు.
మేడారం సమ్మక్క జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. రద్దీ బట్టి అదనంగా మరిన్ని బస్సులు నడిపిస్తాం. ఎవరికీ ఎక్కడా ఇబ్బందులు రాకుండా డీఎంల నుంచి ఉన్నతాధికారుల దాకా పర్యవేక్షణ ఉంటుంది.
– ఆర్ఎం సుచిరిత