Ramagundam | కోల్ సిటీ, మార్చి 24: రామగుండం కార్పొరేషన్ లో అవినీతి భారీగా జరుగుతోందనీ, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఉద్యోగుల కడుపు కొట్టడం బాధాకరమనీ, రేపటిలోగా జీతాలు చెల్లించకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని సీపీఐ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. యూజీడీ అక్రమాలలో ఎవరికి ఎంతెంత పంపకాలు జరిగాయో తేలుస్తామన్నారు. స్థానిక భాస్కర్రావు భవన్ లో మంగళవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్, కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడారు.
రామగుండం కార్పొరేషన్ ను రెండేళ్లుగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. సీడీఎంఏ నిబంధనలకు విరుద్ధంగా టీడీఎఫ్ కు సంబంధించిన రూ.13.70కోట్ల నిధులను మళ్లించి కమిషన్ల కోసం యూజీడీ పనులకు టెండర్లు పిలిచారనీ, కాంట్రాక్టర్లు రింగ్ గా మారి 0.5 నుంచి 1.5 లెస్ పర్సంటేజ్ తో పనులను దక్కించుకున్నారనీ, పైగా ఆర్సీసీ పైపులకు బదులు మట్టి పైపులను వినియోగిస్తూ నాసిరకం పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల విజిలెన్స్ విచారణ జరిగినప్పటికీ స్థానిక ప్రజా ప్రతినిధుల అండ కారణంగా బాధ్యులపై చర్యలకు జాప్యం జరుగుతోందన్నారు. విజిలెన్స్ విచారణ పూర్తయ్యేంత వరకు బిల్లులను నిలిపివేయాలనీ, లేదంటే అధికారులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకవస్తున్నామని ఎమ్మెల్యే చెబుతుంటే కార్మికుల జీత భత్యాల కోసం కేటాయించిన నిధులతో యూజీడీ పనులు చేపట్టాల్సిన అత్యవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రూ.13.70 కోట్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రేపటిలోగా 125 మంది ఉద్యోగుల జీతాలు చెల్లించకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
తమకు ఎమ్మెల్యే ప్రోద్భలం ఉందని కాంట్రాక్టర్లే బాహాటంగా చెప్పుకోవడంను గమనిస్తే కార్పొరేషన్లో అధికారులు స్వయం ప్రతిపత్తి కోల్పోయారని అర్ధమవుతోందన్నారు. నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మాటేటి శంకర్, శనిగరపు చంద్రశేఖర్. రేణిగుంట్ల ప్రీతం, తొడుపునూరి రమే రాణవేణి సుధీర్, నవీన్, శనిగరపు తిరుమల, సాధుల శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.